
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఓ ఖైదీ కడుపు నుంచి సెల్ఫోన్ బయటపడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దౌలత్ఖాన్ అనే ఖైదీ గంజాయి అక్రమ రవాణా కేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్నాడు. జూన్ 23న కడుపునొప్పి వేస్తోందంటూ జైలు అధికారులకు చెప్పాడు. తొలుత జైలు వైద్యులను సంప్రదించి.. మెడిసిన్ తీసుకున్నప్పటికీ పెయిన్ తగ్గలేదు. పరిస్థితి విషమంగా మారడంతో రెండు రోజుల తర్వాత ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
దౌలత్ఖాన్ను పరీక్షించిన వైద్యులు ఎక్స్రే తీసిన అనంతరం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆయన కడుపులో ఒక కీప్యాడ్ సెల్ఫోన్ ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స ఖైదీ కడుపు నుంచి ఫోన్ను తొలగించారు. ఆపై అబ్జర్వేషన్లో ఉంచి జూలై 8న డిశ్చార్జ్ చేశారు. శస్త్రచికిత్స అనంతరం వెలువడిన సెల్ఫోన్ను సీల్డ్ కవర్లో జైలు అధికారులకు అప్పగించారు. BNSలోని పలు సెక్షన్ల కింద దౌలత్ఖాన్పై కేసు నమోదు చేశారు.
అయితే… ఈ ఫోన్ జైలు లోపలికి ఎలా వచ్చింది? దౌలత్ఖాన్ ఎందుకు దాన్ని ఎందుకు మింగాడు? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జైళ్లలో భద్రతా లోపాలను మరోసారి ఎత్తి చూపినట్లైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.