
దేశ రాజధాని ఢిల్లీలో నేరగాళ్లు ఎంత తెలివిగా తప్పించుకోవాలని చూసినా టెక్నాలజీ ముందు తలవంచక తప్పదని మరోసారి రుజువైంది. కరోల్ బాగ్ ప్రాంతంలో ఒక యువకుడిపై జరిగిన దాడి కేసును పోలీసులు కేవలం 72 గంటల్లోనే ఛేదించారు. ఈ దర్యాప్తులో పోలీసులు వాడిన క్లూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 15న రాత్రి కరోల్ బాగ్లోని అజ్మల్ ఖాన్ పార్క్లో ఇసామ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి సోషల్ మీడియా కోసం రీల్స్ షూట్ చేస్తున్నాడు. అదే సమయంలో అక్కడ మద్యం సేవించి ఉన్న ముగ్గురు యువకులు వారిపై అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన తాగిన వ్యక్తి బీరు బాటిల్ను పగలగొట్టి ఆ పదునైన గాజు ముక్కతో ఇసామ్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నిందితుల గురించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. కానీ అక్కడ పడి ఉన్న పగిలిన బీరు బాటిల్ ముక్కపై ఉన్న బార్కోడ్ అధికారుల కంటపడింది. ఆ బార్కోడ్ ఆధారంగా ఆ సీసా ఏ షాపులో అమ్ముడైందో పోలీసులు గుర్తించారు. సదరు మద్యం దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా ఆ సీసాను కొన్న వ్యక్తుల ముఖాలు స్పష్టంగా కనిపించాయి.
నిందితులు పార్క్ నుంచి పారిపోవడానికి వాడిన స్కూటీ నంబర్ను ఇతర కెమెరాల ద్వారా సేకరించి నిందితుల ఆచూకీ కనుగొన్నారు. దాడి చేసిన వ్యక్తిని హమ్మద్ గుర్తించిన పోలీసులు..అతనిపై అప్పటికే 20 ఎఫ్ఐఆర్లు ఉన్నట్లు తెలిపారు. అతని ఫ్రెండ్స్ కమ్రాన్, ఫర్జాన్ కూడా అరెస్ట్ చేశారు. కేవలం అగ్గిపెట్టె అడిగినప్పుడు బాధితుడు నిరాకరించాడనే చిన్న కారణంతోనే తాము దాడి చేశామని నిందితులు విచారణలో అంగీకరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..