నేటి యుద్ధం సరిహద్దులను దాటింది.. దేశాన్ని రక్షించడానికి బలమైన సైన్యం అవసరంః రక్షణ మంత్రి

నేటి యుద్ధాలు సరిహద్దులను దాటి, దేశ భద్రతలో ఆర్థిక, ఇంధన, డిజిటల్, చివరికి ఆహార భద్రతను కూడా ప్రభావితం చేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడగల సన్నద్ధులై ఉండాలన్నారు. పౌరుల మద్దతుతో, బలమైన సైన్యం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

నేటి యుద్ధం సరిహద్దులను దాటింది..  దేశాన్ని రక్షించడానికి బలమైన సైన్యం అవసరంః రక్షణ మంత్రి
Indian Defence Minister Rajnath Singh

Updated on: Mar 21, 2026 | 7:39 PM

నేటి యుద్ధాలు సరిహద్దులను దాటి, దేశ భద్రతలో ఆర్థిక, ఇంధన, డిజిటల్, చివరికి ఆహార భద్రతను కూడా ప్రభావితం చేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ రక్షణ కోసం భుజం భుజం కలిపి నిలబడగల సన్నద్ధులై ఉండాలన్నారు. పౌరుల మద్దతుతో, బలమైన సైన్యం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం (మార్చి 21) ఉత్తరాఖండ్‌లోని ఘోరఖల్‌లో సైనిక్ పాఠశాల వ్యవస్థాపక దినోత్సవం, వజ్రోత్సవ వేడుకలను వర్చువల్‌గా ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేడు ఆర్థిక, సైబర్, అంతరిక్ష, సమాచార యుద్ధాల ద్వారా ఒక దేశాన్ని బలహీనపరచవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో సంఘర్షణలు ఎదుర్కొనే విధానంలో పెద్ద మార్పు వచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, రక్షణ దళాలకు ప్రత్యేక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆయన అన్నారు. దేశం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలగాలంటే, పౌరులు, ముఖ్యంగా యువత, క్రమశిక్షణ, సంకల్పంతో పాటు మానసిక బలం, అవగాహనను పెంపొందించుకోవాలని రక్షణ మంత్రి చెప్పారు. VUCA (అస్థిరమైన, అనిశ్చితమైన, సంక్లిష్టమైన, అస్పష్టమైన) భావనను ప్రస్తావిస్తూ, నేటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి విద్యార్థులు తమ సొంత VUCA రూపాన్ని, అంటే దూరదృష్టి, అవగాహన, ధైర్యం, అనుకూలతను పెంపొందించుకోవాలని ఆయన కోరారు.

దేశ నిర్మాణానికి అవసరమైన విలువలను యువతలో మరింతగా పెంపొందించడానికి మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనా కింద దేశవ్యాప్తంగా 100 కొత్త సైనిక్ పాఠశాలలను స్థాపించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో ఖాళీల సంఖ్యను పెంచడం జరిగిందన్నారు. సైనిక్ పాఠశాలల్లో బాలికలను చేర్చుకోవాలన్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని, విప్లవాత్మకమైనదని, ఇది దేశ ‘మహిళా శక్తిని’ బలోపేతం చేస్తుందని రక్షణ మంత్రి అభివర్ణించారు. ఈ బాలికలు భవిష్యత్తులో ‘మహిళా శక్తి’కి పతాకధారులుగా నిలిచి, వివిధ రంగాలలో కొత్త శిఖరాలను చేరుకుంటారని ఆయన అన్నారు.

ఘోరఖల్‌లోని సైనిక్ స్కూల్ దేశానికి 60 ఏళ్ల అంకితమైన సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, వారి కుటుంబాలను అభినందిస్తూ, విద్యార్థులు అత్యున్నత క్రమశిక్షణ, అంకితభావాన్ని కొనసాగిస్తారని, ఇది వారి కుటుంబాలకు, సంస్థకు, దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా, ఈ పాఠశాల కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ వంటి వివిధ ప్రవేశ పథకాల ద్వారా 800 మందికి పైగా విద్యార్థులను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి, 2,000 మందికి పైగా అభ్యర్థులను సాయుధ దళాలకు పంపిందని ఆయన అన్నారు.

దేశ నిర్మాణానికి గణనీయంగా దోహదపడే నాయకులను ఈ సంస్థ తయారు చేస్తూనే ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వెస్ట్రన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ అయిన లెఫ్టినెంట్ జనరల్ ఎం.కె. కటియార్‌తో సహా పాఠశాల ప్రముఖ పూర్వ విద్యార్థులు విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us