Cyclone Gulab: అల్పపీడనంగా మారిన గులాబ్‌ తుఫాన్‌.. మధ్య భారతాన్ని వదలని భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

|

Sep 28, 2021 | 8:30 PM

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మహారాష్ట్రలో కూడా వరదలు వణికిస్తున్నాయి. యావత్‌మాల్‌లో బస్సు వరదనీటిలో కొట్టుకుపోవడంతో ఇద్దరు చనిపోయారు. గుజరాత్‌ లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది.

Cyclone Gulab: అల్పపీడనంగా మారిన గులాబ్‌ తుఫాన్‌.. మధ్య భారతాన్ని వదలని భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం
Heavy Rains
Follow us on

Cyclone Gulab Effect Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మహారాష్ట్రలో కూడా వరదలు వణికిస్తున్నాయి. యావత్‌మాల్‌లో బస్సు వరదనీటిలో కొట్టుకుపోవడంతో ఇద్దరు చనిపోయారు. గుజరాత్‌ లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది.

అల్పపీడనంగా మారిన గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉత్తర , పశ్చిమ భారతంలో కూడా కుంభవృష్టి కురుస్తోంది. మహారాష్ట్ర లోని నాందేడ్‌ -నాగ్‌పూర్‌ హైవేపే రోడ్డు రవాణా సంస్థ బస్సు అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయింది. యావత్‌మాల్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వరదలో కొట్టుకుపోయిన బస్సులో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా .. నలుగురు మాత్రం ఈదుకుంటూ బయటపడ్డారు. భారీ వరదల కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆకస్మాత్తుగా కాలువ దగ్గర వరద ప్రవాహం పెరగడంతో బస్సు కొట్టుకుపోయింది. స్థానికులకు కాసేపు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఇద్దరు ప్రయాణికులకు కాపాడడానికి సహాయక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. డ్రైవర్‌ వరద ప్రవహాన్ని ఊహించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
యావత్‌మాల్‌తో పాటు నాసిక్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నాసిక్‌ -త్రయంబకేశ్వర్‌లో గోదావరి నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో నాసిక్‌ లోని చాలా ఆలయాలు నీట మునిగాయి.

నాసిక్‌లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో కూడా పలుచోట్ల భారీవర్షాలు కురుస్తున్నాయి. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిమగ్నమయ్యాయి. గుజరాత్‌లో కూడా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మధ్యప్రదేశ్‌ , మహారాష్ట్ర , గోవా , కొంకణ్‌ ప్రాంతంలో రానున్న మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్‌ జారీ చేసింది. తూర్పు ప్రాంతంలో ఏర్పడ్డ తుఫాన్‌ బలహీనపడి అల్పపీడనంగా మారి మధ్య , పశ్చిమ , ఉత్తర భారత వైపు కదులుతోంది. గుజరాత్‌లో తీరప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అధికారులు. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
Read Also…  AP Covid 19: ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో కొత్త నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..?