Congress: అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కాంగ్రెస్ లో మార్పులకు శ్రీకారం.. వర్కింగ్ కమిటీ స్థానంలో స్టీరింగ్ కమిటీ..

|

Oct 26, 2022 | 8:21 PM

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారు రాజీనామా చేయడంతో హస్తం పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. సీడబ్ల్యూసీ సభ్యులు..

Congress: అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కాంగ్రెస్ లో మార్పులకు శ్రీకారం.. వర్కింగ్ కమిటీ స్థానంలో స్టీరింగ్ కమిటీ..
Mallikarjun Kharge
Follow us on

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారు రాజీనామా చేయడంతో హస్తం పార్టీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. సీడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శుల రాజీనామా నేపథ్యంలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో మొత్తం 47 మంది సభ్యులుగా ఉండగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్ తో సహా పలువురు సీనియర్ నేతలకు స్టీరింగ్ కమిటీలో చోటు కల్పించారు. మాజీ రాజ్యసభ సభ్యులు, తెలుగు వ్యక్తి టి.సుబ్బిరామిరెడ్డికి కూడా ఈ కమిటీలో చోటు దక్కింది. అజయ్ మాకెన్, అంబికా సోని, ఆనంద్ శర్మ, హరీష్ రావత్, జైరాం రమేశ్, కుమార్ షెల్జా, చిదంబరం, రణదీప్ సూర్జేవాలా, దిగ్విజయ్ సింగ్ వంటి సీనియర్ నాయకులను స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా నియమించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున్‌ ఖ‌ర్గే అక్టోబర్ 26వ తేదీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే.. 98వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో 24 ఏళ్ల త‌రువాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఖర్గే నిలిచారు.  గతవారం జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌ పై మల్లికార్జున ఖర్గే గెలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక సహా నేతలంతా ఖర్గేను అభినందించి.. శుభాకాంక్షలు తెలిపారు.

2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. ఎంతో మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ ను వదిలి వెళ్లిపోయారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ కొట్టిమిట్టాడుతోందని సొంతపార్టీ నేతలే విమర్శిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర చేపట్టి ప్రజలందరితో మమేకమవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ కేంద్రప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నారు. మరోవైపు దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మల్లికార్జున్ ఖర్గే ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

PR_Steering_Committee

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..