PayCM Poster: కర్నాటకలో మరింత ముదిరిన పేసీఎం వివాదం.. బెంగళూర్‌ రోడ్లపై పోస్టర్లను అంటించిన కాంగ్రెస్ నాయకులు

|

Sep 23, 2022 | 7:02 PM

పేసీఎం పోస్టర్లను రాష్ట్రవ్యాప్తంగా అంటిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. బెంగళూర్‌లో రోడ్ల మీద పేసీఎం పోస్టర్లను అంటించేందుకు ర్యాలీగా బయలుదేరారు కాంగ్రెస్‌ నేతలు.

PayCM Poster: కర్నాటకలో మరింత ముదిరిన పేసీఎం వివాదం.. బెంగళూర్‌ రోడ్లపై పోస్టర్లను అంటించిన కాంగ్రెస్ నాయకులు
Karnataka Congress
Follow us on

కర్నాటకలో పేసీఎం వివాదం మరింత ముదిరింది. బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు మరింత ఉధృతం చేశారు కాంగ్రెస్‌ నేతలు. ప్రతి పనిలో ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైకి 40 శాతం కమీషన్లు అందుతున్నాయని కాంగ్రెస్‌ ఆరోపిస్తూ భారీ ప్రచారం చేపట్టింది. పేసీఎం పోస్టర్లను రాష్ట్రవ్యాప్తంగా అంటిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. బెంగళూర్‌లో రోడ్ల మీద పేసీఎం పోస్టర్లను అంటించేందుకు ర్యాలీగా బయలుదేరారు కాంగ్రెస్‌ నేతలు. పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ , సీఎల్పీ నేత సిద్దరామయ్య , కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. ఇతర నేతలు ఈ ర్యాలీలు పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్‌ నేతలు గోడకు పేసీఎం పోస్టర్లను అంటిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కాంగ్రెస్‌ నేతలకు మధ్య తోపులాట జరిగింది.

అయినప్పటికి రోడ్డు మీద పోస్టర్లను అంటించి నిరసన తెలిపారు కాంగ్రెస్‌ నేతలు. పేసీఎం పోస్టర్లను అంటిస్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అండతో కర్నాటక ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు ఏఐసీసీ జనరల్‌ సెక్రటీరీ రణదీప్‌ సూర్జేవాలా.. బొమ్మై అవినీతి ప్రభుత్వాన్ని కర్నాటక ప్రజలు అరేబియా సముద్రంలో విసిరేస్తారని అన్నారు.

కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్

కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఎంబీ పాటిల్, హెచ్‌కే పాటిల్, కే. జే జార్జ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు నేతలను అదుపులోకి తీసుకుని బీఎంటీసీ బస్సులో తరలించారు. అయితే కాంగ్రెస్ నేతలను తరలిస్తున్న బస్సుకు బ్రేకులు పడలేదు. దీంతో కాంగ్రెస్ నేతలను బీఎంటీసీ బస్సు డ్రైవర్ కిందకు దింపేశాడు.

ప్రభుత్వం అవినీతిమయమైంది – సిద్ధరామయ్య

రేపు రాష్ట్రవ్యాప్తంగా ‘పే సిఎం’ పోస్టర్ ప్రచారం నేపథ్యంలో సిఎల్‌పి నేత సిద్ధరామయ్య బెంగళూరులో ప్రకటన చేశారు, రాష్ట్రవ్యాప్తంగా ‘పే సిఎం’ పోస్టర్ ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ పోస్టర్ ప్రచారాన్ని కొనసాగించనుంది. ప్రభుత్వం అవినీతిమయమైందని ప్రజలు అంటున్నారని మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు.

మమ్మల్ని అరెస్ట్ చేయనివ్వండి చూద్దాం: బీకే హరిప్రసాద్

ఈ ప్రచారానికి సంబంధించి శాసనమండలి విపక్ష నేత బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయనివ్వండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు. చేతనైతే ‘పే సీఎం’ పోస్టర్ అంటించినందుకు తమను అరెస్ట్ చేయాలని పరిషత్ ప్రతిపక్ష నేత హరిప్రసాద్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

మెజెస్టిక్ చుట్టూ ట్రాఫిక్ జామ్..

‘పే సీఎం’ ప్రచారంతో మెజెస్టిక్ చుట్టూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బీటీసీ కాంపౌండ్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులు పోస్టర్లు అతికించి, రేస్‌కోర్స్‌ వద్ద పోస్టర్లు అతికించి నిరసన తెలిపారు. ఈ సమయంలో మెజెస్టిక్‌, ఆనందరావు సర్కిల్‌, శివానంద సర్కిల్‌, రేస్‌కోర్స్‌ రోడ్డు చుట్టూ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

చివరికి నిజమే గెలుస్తుంది: సీఎం బొమ్మై

కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఏంటి? వారికేది కావాలో అదే చేయనీవండి. అంతిమంగా నిజమే గెలుస్తుందని ‘పే సీఎం’ పోస్టర్ ప్రచారంపై సీఎం బసవరాజ బొమ్మై అన్నారు. పీసీఎం ప్రచారానికి బీజేపీ కౌంటర్ ఏంటని ప్రశ్నించగా.. ఏం చేయాలో అదే చేస్తామని జవాబిచ్చారు. రెండు వారాల పాటు సభ జరిగింది. అతివృష్టి అంశంపై సభలో చర్చ జరిగింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు కౌంటర్ ఇచ్చారు. కాంట్రాక్టర్ల సంఘం నుంచి వచ్చిన లేఖ గురించి నేను ఇప్పటికే సమాధానం ఇచ్చాను. ఈరోజు నేను కాంట్రాక్టర్ల సంఘాన్ని డాక్యుమెంట్ ఇవ్వమని అడుగుతాను. విచారణ కోసం నేరుగా లోకాయుక్తకు డాక్యుమెంట్ ఇస్తాను. ఆధారాలు లేకుండా మాట్లాడే ధోరణి ఎక్కువ కాలం ఉండదు. తమ పార్టీ అవినీతి గురించి మాట్లాడింది కాంగ్రెసోళ్లే. సభ ప్రారంభం రోజునే కమిషన్ విచారణ చేపట్టి ఉండవచ్చు. చర్చ చివరి రోజున 40% కమీషన్ ఎందుకు తీసుకున్నారు.  

మరిన్ని జాతీయ వార్తల కోసం