ఢిల్లీ హింసపై సోమవారం లోక్ సభ అట్టుడికింది. ఇటీవల ఈ నగరంలో జరిగిన హింసాకాండపై చర్చ జరపాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండు చేస్తూ..సభా కార్యకలాపాలను స్తంభింప జేయడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే మధ్యాహ్నం మళ్ళీ సమావేశమైనప్పుడు కూడా సభలో ఇదే పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల పరస్పర నినాదాలతో సభ హోరెత్తింది. ఒక దశలో వీరిమధ్య తోపులాట జరిగింది. బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ మాట్లాడుతుండగా ఆయనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ముందుకు చొచ్చుకుపోయారు. ఈ రభసతో స్పీకర్ మళ్ళీ సభను సాయంత్రం నాలుగున్నర గంటలకు వాయిదా వేశారు. హోమ్ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండు చేయడం, వారిని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు యత్నించడంతో సభలో రభస పునరావృతమైంది.