CM KCR: సోలాపూర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి భారీ స్వాగతం..

5 వందల కార్లు.. 2 వేల మంది ప్రజాప్రతినిధులు.. భారీ కాన్వాయ్‌.. రోడ్డు మార్గాన ప్రగతి భవన్ టూ మహారాష్ట్ర.. టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన తొలినాళ్లలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీకి వినిపించేందుకు చలో ఢిల్లీ పేరుతో భారీ కారు ర్యాలీ నిర్వహించారు కేసీఆర్. ఇప్పడు అదే తరహాలో ప్రగతిభవన్‌ నుంచి పండరీపురం యాత్రకు వెళ్లారు. దీంతో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌ సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఉదయం ప్రారంభమైన సీఎం కేసీఆర్ యాత్ర సాయంతానికి సోలాపూర్ చేరుకుంది.

CM KCR: సోలాపూర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి భారీ స్వాగతం..
CM KCR

Updated on: Jun 26, 2023 | 9:07 PM

వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నారు. ఇందుభాగంగా మహారాష్ట్రను టార్గెట్‌ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలకు భారీ స్పందన లభించింది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు మహారాష్ట్రలో పర్యటించిన కేసీఆర్… మరోసారి మరాఠా గడ్డపై అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనకు ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు.. 500ల కార్లు.. 2వేల మంది ప్రజాప్రతినిధులతో భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు చేరుకున్నారు. దారి పొడవునా సీఎం కేసీఆర్‌కు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు. జై కేసీఆర్‌.. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించాయి.

మహారాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్ స్వయంగా 400 మంది ముఖ్యనేతలకు ఫోన్ చేసి ప్రగతిభవన్‌కు పిలిపించినట్లు తెలుస్తోంది. దాదాపు 4గంటలపాటు భారీ కాన్వాయ్‌లో పయనించి ముందుగా మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లా ఒమర్గాకు చేరుకున్నారు. ఒమర్గాలో మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం సోలాపూర్‌కు చేరగా.. ముఖ్యమంత్రికి బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు. రాత్రి సోలాపూర్‌లోనే బస చేయనున్నారు కేసీఆర్‌.

ఇక మంగళవారం ఉదయం 8 గంటలకు పండరీపురానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ రుక్మిణీ సమేత విఠేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా సర్కోలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతారు. ఇక్కడి స్థానిక నేతలు కొందరు పార్టీ కండువ కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. అక్కడే భోజనాలు ముగించుకొని.. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. మార్గంమధ్యలో 3.30 గంటలకు దారాశివ్‌ జిల్లా తుల్జాపుర్‌లోని ప్రముఖ శక్తిపీఠం ‘తుల్జా భవానీ’ అమ్మవారిని సీఎం కేసీఆర్‌, ఇతర ప్రజాప్రతినిధులు దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు సాయంత్రం చేరుకుంటారు.

ఇప్పటికే మహారాష్ట్రలో దూకుడుగా ముందుకెళ్తున్న బీఆర్‌ఎస్‌ నాగ్‌పూర్‌లో ఇటీవలే పార్టీ ఆఫీస్‌ను కూడా ప్రారంభించుకుంది. తాజాగా కేసీఆర్‌ రెండ్రోజుల పర్యటనలో ఆధ్యాత్మిక కోణమే కనిపిస్తున్నా… విరామసమయాల్లో జరిగే రాజకీయ మీటింగులు, చర్చలు మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌కు మరింత బలాన్నిస్తుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.