
అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి సర్వం సిద్దమైంది. మరికొన్ని గంటల్లో చారిత్రాత్మకంగా నిర్మించిన ఆలయంలో బాలరాముడు కొలువుదీరబోతున్నారు. ప్రత్యేక నిఘా నేత్రాలు, కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రంగురంగుల పుష్ఫాలతో ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇదిలా ఉంటే రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి లక్షల మంది తరలిరానున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందాయి. బాల రాముడి దర్శనానికి తరలి వచ్చే భక్తులకు అన్నపానీయాలు అందించేందుకు పలు ధార్మిక సంస్థలు ముందుకు వచ్చాయి. రామ భక్తులకు ఉచితంగా అల్పాహారాలు, టీ, మంచినీళ్లు అందించనున్నాయి. అందుకు సంబంధించి పలు వంటశాలలు ఏర్పాటయ్యాయి.
నిహాంగ్ సింగ్స్, ఇస్కాన్ వంటి సంస్థలు ఈ ఏర్పాట్లను చేశాయి. రాం కీ రసోయ్ నుంచి లంగర్ వరకూ వంటశాలలను ఏర్పాటు చేశాయి. అయోధ్యలోని ప్రతి వీధిలో ఇవి ఏర్పాటయ్యాయి. కిచిడీ, ఆలూ పూరీ, కధీ చావల్, ఆచార్, పాపడ్లను భక్తులను అందించనున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో వేడి టీనీ భక్తులకు ఇస్తున్నారు. బాబా హర్జీత్సింగ్ రసూల్పుర్ నేతృత్వంలో నిహాంగ్ సిక్కుల గ్రూపు శుక్రవారం అయోధ్య చేరుకుంది. ఛార్ధామ్ మఠ్లో వారు 2 నెలలపాటు లంగర్ను ఏర్పాటు చేసి ఆహారాన్ని అందించనున్నారు. పట్నాకు చెందిన మహావీర్ ఆలయ ట్రస్టు రోజుకు 10,000 మందికి ఆహారాన్ని అందించేలా రాం కీ రసోయ్ వంట గదిని సిద్ధం చేసింది. ఇస్కాన్ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రోజుకు 5,000 మందికి ఆహారాన్ని అందించనుంది. ఇలా ఎవరికి తోచిన సాయాన్ని వారు ఉడుతా భక్తిగా అందించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు అనేక సౌకర్యాలు కల్పించారు.
అయోధ్య లైవ్ కవరేజ్ వీడియో..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..