Operation Chakra: 16 రాష్ట్రాలు.. 60 టీమ్‌లు.. సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు!

డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్న సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు సీబీఐ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ చక్ర-VI కింద దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 80కి పైగా ప్రాంతాల్లో ఏకకాల సోదాలు నిర్వహించింది. చెన్నై, కోల్‌కతాలో ఇద్దరు నిందితుల అరెస్టు చేసింది.

Operation Chakra: 16 రాష్ట్రాలు.. 60 టీమ్‌లు.. సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు!
Cbi Operation Chakra

Edited By:

Updated on: Jun 25, 2026 | 1:07 PM

డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్న సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు సీబీఐ భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమబెంగాల్, మణిపూర్, కర్ణాటక, ఒడిశా తదితర 16 రాష్ట్రాల్లో దాదాపు 60 ప్రత్యేక బృందాలతో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే డిజిటల్ ప్రాడ్ నెట్‌వర్క్‌ సుమారు 200కి పైగా సైబర్ ఫ్రాడ్ కేసుల్లో పాలుపంచుకున్నట్లు అనుమానం వ్యక్తి చేససింది.

నిందితులు షెల్ కంపెనీలను సృష్టించి, మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా మోసాల ద్వారా వచ్చిన డబ్బును లాండరింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించారని సీబీఐ ఆరోపించింది. దర్యాప్తులో సుమారు రూ.2 కోట్ల విలువైన అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చాయని.. సోదాల సమయంలో మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు, బ్యాంకు రికార్డులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది.ఈ ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయని పేర్కొంది.

నకిలీ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌తో మోసం

అయితే ఈ డిజిటల్ ఫ్రాడ్ నెట్ వర్క్ నిందితులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్ను సృష్టించి, దాని ద్వారా ప్రజలను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నట్లు కూడా సీబీఐ దర్యాప్తులో తేలింది. నకిలీ కోర్టు ఉత్తర్వులు, ఫోర్జరీ పత్రాలు, దర్యాప్తు సంస్థల పేరుతో తయారు చేసిన డాక్యుమెంట్లను ఉపయోగించి సామాన్యులను మోసం చేస్తున్నట్టు గుర్తించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఫ్రాడ్

డిజిటల్ మోసాల నెట్‌వర్క్ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా, విదేశాల్లోని ప్రజలను కూడా మోసం చేస్తున్నట్టు సీబీఐ గుర్తించింది. సంబంధిత దేశాల ఏజెన్సీలకు సమాచారం అందించి, వారితో సమన్వయం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ డిజిటల్ ప్రాడ్ నెట్ వర్క్ కి సంబంధించి సీబీఐ మరిన్ని అరెస్టులు, సోదాలు చేపట్టే అవకాశం ఉంది.

అధికారుల సూచనలు

ఈ నేపథ్యంలో జనాలకు అధికారులు కొన్ని కీలక సూచనలు చేశారు. డిజిటల్ అరెస్ట్, ఫేక్ కోర్టు నోటీసులు, వీడియో కాల్ మోసాలకు పాల్పడే వారి నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే అరెస్టు బెదిరింపులు, ఫేక్ కోర్టు లింకులు పట్టించుకోవద్దని ,సందేహం వచ్చిన వెంటనే స్థానిక పోలీసులు లేదా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us