దక్షిణాదిలో పాగాకు బిజెపి మాస్టర్ ప్లాన్

|

Dec 18, 2019 | 4:54 PM

కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాదిలో పాగా వేయడానికి కమలం సరికొత్తవ్యూహాలు పన్నుతోందా? పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగుతున్న తరుణంలో, దక్షిణాది మీద మరింత ఫోకస్‌ పెడుతోందా? పార్టీని సౌత్‌లో బలోపేతం చేయడానికి, ప్రత్యేకంగా దక్షిణ భారతం కోసం ఒక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను నియమించే ఆలోచన చేస్తోందని సమాచారం. గతంలో ఉత్తరాది పార్టీగా పేరుపడిన భారతీయ జనతా పార్టీ, మోదీ-అమిత్‌షాల నాయకత్వంలో దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించింది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ, దేశవ్యాప్తంగా తన పునాదిని పెంచుకుంటోంది. అయితే […]

దక్షిణాదిలో పాగాకు బిజెపి మాస్టర్ ప్లాన్
Follow us on

కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాదిలో పాగా వేయడానికి కమలం సరికొత్తవ్యూహాలు పన్నుతోందా? పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగుతున్న తరుణంలో, దక్షిణాది మీద మరింత ఫోకస్‌ పెడుతోందా? పార్టీని సౌత్‌లో బలోపేతం చేయడానికి, ప్రత్యేకంగా దక్షిణ భారతం కోసం ఒక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను నియమించే ఆలోచన చేస్తోందని సమాచారం.

గతంలో ఉత్తరాది పార్టీగా పేరుపడిన భారతీయ జనతా పార్టీ, మోదీ-అమిత్‌షాల నాయకత్వంలో దేశంలోని అనేక రాష్ట్రాలకు విస్తరించింది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ, దేశవ్యాప్తంగా తన పునాదిని పెంచుకుంటోంది. అయితే దక్షిణాది మాత్రం బీజేపీకి ఇప్పటికీ కొరకరాని కొయ్యగానే మిగిలింది. ఒక్క కర్నాటకలోనే అధికారంలోకి రాగలిగింది. అక్కడ కూడా అతికొద్ది మెజారిటీతోనే సర్కారును ఇప్పుడు కొనసాగిస్తోంది. ఇక మిగతా దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలు బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. 2023 ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతో ప్రత్యేక వ్యూహాలు పన్నుతోంది కమలం పార్టీ.

ఇప్పుడు బీజేపీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, దక్షిణాదికి ఒకరు , ఉత్తరాదికి మరొకరు… ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీకి జేపీ నడ్డా వర్కింగ్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అమిత్‌షా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. త్వరలో నడ్డాను పూర్తస్థాయి ప్రెసిడెంట్‌ని చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దక్షిణాదిలో ప్రాంతీయపార్టీల హవాకి అడ్డుకట్ట వేయడానికి, ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్ల ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న బీజేపీ , వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న ధీమాతో దూకుడు పెంచింది. సమస్యలపై జనంలోకి వెళుతోంది. ప్రధాని మోదీ కూడా తనను కలిసిన ఎంపీలకు ఈసారి పవర్‌లోకి వస్తామని చెప్పారు. అలాగే మోదీ, అమిత్‌షాలు తెలంగాణలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. స్థానిక బీజేపీ నాయకత్వం కూడా , టిఆర్‌ఎస్‌కి తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటోంది.

ఏపీలో ఆరుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని రామ్‌మాధవ్‌ చెప్పారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్‌ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటోంది. వైసీపీ సర్కారుమీద విమర్శలను పెంచింది. ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు పవన్ కల్యాణ్‌ని మచ్చిక చేసుకునే పనిలో కొందరు బిజెపి నేతలున్నారు.

ఇక తమిళనాడులోని ఉన్న అన్ని ప్రాంతీయపార్టీలకి ద్రవిడ సిద్ధాంతాలే మూలం. హిందీని వ్యతిరేకించటం, ఉత్తరాది పెత్తనాన్ని వ్యతిరేకించటం వాటి నైజం. అయితే జయలలిత మరణం తర్వాత అధికారపార్టీ అయిన అన్నాడిఎంకె కేంద్రంలోని బీజేపీతో చాలా వరకూ సఖ్యతతో మెలుగుతోంది. ఇక మరో ముఖ్యమైన పార్టీ డిఎంకె , కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తోంది. ఇక సినీ నటులు కమల్‌ హాసన్ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. మరోసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనపై బీజేపీ ముద్ర వేయవద్దని కోరారు. ఇక కేరళ విషయానికి వస్తే – అక్కడ ఎంట్రీ ఇవ్వడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అక్కడ క్యాడర్ బాగానే వున్నా ఎన్నికల్లో గెలిపించే స్థాయికి ఇంకా ఎదగలేదు.

అభేద్యంగా ఉన్న దక్షిణాదిలో విస్తరించడానికి , ఈ ఇద్దరు వర్కింగ్‌ప్రెసిడెంట్ల ఆలోచన ఎంతవరకూ ఉపకరిస్తుందా? ఇది ఆలోచన వాస్తవరూపం దాలుస్తుందా లేదా అన్న విషయం కొద్దిరోజులు ఆగితే కానీ తెలీదు.