
బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఓ విచిత్రమైన దొంగతనం కేసు సంచలనంగా మారింది. మహిళ మెడలోని బంగారు ఆభరణాన్ని లాక్కొని పారిపోయిన ఓ యువకుడు, స్థానికులు మరియు పోలీసులు చుట్టుముట్టడంతో సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఆ దొంగిలించిన బంగారు ఆభరణాన్నే మింగేశాడు. అయితే ఆసుపత్రిలో తీసిన ఎక్స్రేలో అతని కడుపులో ఆ బంగారు ఆభరణం స్పష్టంగా కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్తి ధాలా సమీపంలో ఈ ఘటన జరిగింది. హనుమాన్గఢ్ నుంచి తన భర్తతో కలిసి బైక్పై పుట్టింటికి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు డోలక్ను నిందితుడు ఒక్కసారిగా లాక్కొని పారిపోయాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అతడిని వెంబడించారు. చివరకు సమీపంలోని ఓ పబ్లిక్ టాయిలెట్లో దాక్కున్న నిందితుడిని బయటకు లాగి పట్టుకున్నారు.
పట్టుబడ్డానని గ్రహించిన నిందితుడు, తన వద్ద ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు దొంగిలించిన బంగారు ఆభరణాన్ని నోట్లో వేసుకుని మింగేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకుని బెగుసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చేసిన ఎక్స్రేలో అతని కడుపులో బంగారు ఆభరణం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. ప్రస్తుతం నిందితుడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, చట్టపరమైన విధానంలో ఆభరణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అరెస్టు చేసిన నిందితుడిని భగవాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రాహుల్ కుమార్గా పోలీసులు గుర్తించారు. విచారణలో తాను ఈ-రిక్షా డ్రైవర్గా పనిచేస్తున్నానని, ఘటన సమయంలో మద్యం మత్తులో ఉన్నానని, మహిళ మెడలో బంగారం కనిపించడంతో దొంగతనానికి పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సాక్ష్యాలను దాచేందుకు దొంగిలించిన బంగారాన్నే మింగేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..