
పీరియడ్స్ సమయంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలకు ఆ సమయంలో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో దేశంలోని పంజాబ్ యూనివర్శిటీ చండీగఢ్ విద్యార్థినుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పీరియడ్స్ సమయంలో సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. రుతుక్రమ సెలవుల విషయంలో చొరవ తీసుకోవడంలో పంజాబ్లో ఒక యూనివర్శిటీ ముందు నిలిచింది. ఈ మేరకు యూనివర్శిటీ ఈ సమాచారం ఇస్తూ సర్క్యులర్ జారీ చేసింది. అయితే దీనికి కొన్ని షరతులు కూడా విధించింది.
2024-25 వచ్చే విద్యా సంవత్సరం నుండి బాలికలకు షరతులతో సెలవు ఇవ్వబడుతుందని తెలిపింది. అయితే ఈ సెలవు ఒక రోజు మాత్రమే ఇవ్వబడుతుంది. సెలవు తీసుకోవడానికి ముందు అమ్మాయిలు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫారమ్ను సమర్పించిన వెంటనే విద్యార్థికి సెలవు అనుమతి లభిస్తుంది. అంటే క్యాలెండర్ ప్రకారం.. ఒక విద్యార్థి పీరియడ్స్ కారణంగా ఒక నెలలో ఒక రోజు సెలవు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం సెమిస్టర్కు నాలుగు రోజులు సెలవులు ఇస్తారు. అదనంగా మరో సెలవును ఇవ్వనుంది.
సాధారణ రోజుల్లో మాత్రమే సెలవు ఉంటుంది. పరీక్ష సమయంలో బాలిక విద్యార్థులు ఈ సెలవు కోసం దరఖాస్తు చేయలేరు. సెలవు అనుమతిని ఛైర్మన్/డైరెక్టర్ ఇస్తారు. విద్యార్థి స్వీయ ధృవీకరణ ఆధారంగా సెలవు ఇవ్వబడుతుంది. అయితే ఇక యూనివర్సిటీ విద్యార్థుల హాజరు, సెలవులను పరిశీలిస్తుంది కూడా. నిర్దిష్ట నెలలో ఒక రోజు మాత్రమే సెలవు మంజూరు చేయబడుతుంది. కాగా దీనికి ముందు కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అస్సాంలోని గౌహతి యూనివర్శిటీ, నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా హైదరాబాద్, తేజ్పూర్ యూనివర్శిటీ ఆఫ్ అస్సాం విద్యార్థినుల అవసరాన్ని బట్టి సెలవులను ఇస్తున్నాయి.