
అయోధ్య రామ మందిర కానుకల దొంగతనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలను ట్రస్ట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. కానుకల దొంగతనం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత వీరి పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి.. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు.
సోమవారం (జూలై 06) ట్రస్ట్ సమావేశంలో కానుకల దొంగతనం ఘటన దేశవ్యాప్తంగా కలిగించిన ప్రభావం, రామ మందిర ప్రతిష్ఠకు జరిగిన నష్టం వంటి అంశాలపై కూడా విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ముందుగా చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాల అంశాన్ని పూర్తి చేసి, అనంతరం ఇతర అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశానికి హాజరయ్యేందుకు ప్రయత్నించిన గోపాల్ రావును ట్రస్ట్ సభ్యులు లోపలికి అనుమతించలేదని సమాచారం. మరోవైపు, ట్రస్ట్లో జరిగిన పలు నియామకాలలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా కీలక పాత్ర పోషించిన విషయాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వీరి బాధ్యతల బదిలీ, కొత్త నియామకాలపై కూడా ట్రస్ట్ సభ్యులు చర్చించారు.
ట్రస్ట్ సమావేశానికి హాజరైన స్వామి పరమానంద్ గిరి మాట్లాడుతూ, మతాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన రామ మందిరంలో కానుకల దొంగతనం ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందోళనకు గురి చేశాయన్నారు. ఇలాంటి ఘటనలు దేవాలయ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, ప్రస్తుతం ఈ కేసుపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను అధికారులు విచారించినట్లు సమాచారం. రాజీనామాలు ఆమోదం పొందిన నేపథ్యంలో, దర్యాప్తు ఆధారంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..