Aryabhatta Satellite: ఆర్యభట్టకు 46 ఏళ్ళు.. భారత తొలి ఉపగ్రహానికి ఆ పేరే ఎందుకు పెట్టారంటే?

|

Apr 19, 2021 | 5:04 PM

ఈ ఒప్పందం చేసుకునేందుకు గాను ప్రతిఫలంగా భారతదేశం నుంచి ఆనాటి సోవియట్ యూనియన్ పెద్ద సహాయాన్ని కోరింది. భారత రేవుల నుంచి ఓడల నుంచి లాంచింగ్ వాహనాల జాడలు పట్టేందుకు వాటిని ట్రాకింగ్ చేసేందుకు ఇండియా… సోవియట్ యూనియన్ కు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది.

Aryabhatta Satellite: ఆర్యభట్టకు 46 ఏళ్ళు.. భారత తొలి ఉపగ్రహానికి ఆ పేరే ఎందుకు పెట్టారంటే?
Follow us on

Aryabhatta Satellite India’s First Satellite: ఇండియా (INDIA) అంతరిక్ష ప్రయోగం జరిపి నేటికి (ఏప్రిల్ 19 నాటికి) 46 ఏళ్ళు. భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహం ప్రయోగించిన రోజు ఏప్రిల్ 19. మన దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట (ARYABHATTA) అనే నామకరణం చేశారు. ఈ ఉపగ్రహాన్ని ఇండియా ఆనాటి సోవియట్ యూనియన్ (SOVIET UNION) లోని కాపుస్తిన్ యార్ నుంచి కాస్మోస్ 3ఎం (COSMOS 3M) ఉపగ్రహ వాహక నౌక సహాయంతో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారతదేశ ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్యుడు అయిన ఆర్యభట్ట జ్ఞాపకార్థం భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆయన పేరు పెట్టారు. ఈ చారిత్రక దినోత్సవాన్ని జరుపుకునేందుకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RESERVE BANK OF INDIA) 1976, 1997 సంవత్సరాలలో ప్రత్యేకంగా రెండు రూపాయల నోటుపై ఆర్యభట్ట సాటిలైట్ చిత్రాన్ని ముద్రించింది. భారతదేశంలో అప్పట్లో ఉపగ్రహ ప్రయోగానికి సరైన ఏర్పాట్లు లేవు.. ఆర్యభట్ట శాటిలైట్ (ARYABHATTA SATELLITE) ని పూర్తిగా ఇండియాలోనే నిర్మించినప్పటికీ దాని ప్రయోగం మాత్రం రష్యా (RUSSIA) నుంచి చేశారు. ఇందుకోసం ఆనాడు భారత ప్రభుత్వం తరఫున ప్రొఫెసర్ యు ఆర్ రావు (PROFESSOR U R RAO) సారథ్యంలోని బృందం 1972 లో రష్యా వెళ్లి ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం చేసుకునేందుకు గాను ప్రతిఫలంగా భారతదేశం నుంచి ఆనాటి సోవియట్ యూనియన్ పెద్ద సహాయాన్ని కోరింది. భారత రేవుల నుంచి ఓడల నుంచి లాంచింగ్ వాహనాల జాడలు పట్టేందుకు వాటిని ట్రాకింగ్ చేసేందుకు ఇండియా… సోవియట్ యూనియన్ కు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది.

సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించిన భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్ట భూమిచుట్టూ 96 నిముషాల 46 సెకండ్లలో ప్రదక్షిణ కాలం పట్టేలా .. భూమి నుంచి 611 కిలోమీటర్ల అపోజి (భూమి నుంచి ఎక్కువ దూరం)లో ప్రవేశ పెట్టారు. ఇది భూమి నుంచి దగ్గరి దూరం పెరిజీ 568 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. 50.6 డిగ్రీల ఏటవాలులో ఆర్యభట్టను ప్రవేశపెట్టారు. ప్రయోగించిన నాలుగు రోజుల తర్వాత 60 ప్రదక్షణలు పూర్తిచేసుకున్న ఈ ఉపగ్రహంలో విద్యుత్ ఉత్పత్తిలో లోపం ఏర్పడింది. దాంతో సాటిలైట్ పనిచేయడం మానేసింది. అయితే ఆ తర్వాత తిరిగి పనిచేయడం ప్రారంభించింది ఆర్యభట్ట ఉపగ్రహం. సోవియట్ యూనియన్ మీడియా కథనాల ప్రకారం ఆర్యభట్ట ఉపగ్రహం కొంతకాలం వరకు పనిచేసి సమాచారాన్ని పంపినట్లు తెలుస్తోంది. ఉపగ్రహం 1992 ఫిబ్రవరి 11న తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రొఫెసర్ యు ఆర్ రావు 360 కిలోల బరువుతో నిర్మించారు. ఆ సమయంలో ఇస్రో ఛైర్మెన్ గా వ్యవహరించారు.

1969 ఆగస్ట్ 15 న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వ్యవస్థాపన జరిగింది. ఆ తరువాత ఆరు సంవత్సరాలకు అంటే 1975లో భారతదేశం తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. తొలి ఉపగ్రహాన్ని సోవియట్ యూనియన్ గడ్డపై నుంచి అంతరిక్షానికి ప్రయోగించిన భారతదేశం ఇప్పుడు సొంత భూమి నుంచి శ్రీహరికోట (SRIHARIKOTA) అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి కలుగుతోంది. అయితే తొలి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించిన భారతదేశం.. తన రెండు ఉపగ్రహం రోహిణి-1 (ROHINI – 1)ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి 1979 ఆగస్టు 10వ తేదీన విజయవంతంగా ప్రయోగించగలిగింది. గత నలభై ఆరు సంవత్సరాల చరిత్రలో భారత దేశంలో ఇప్పటి వరకు 101 అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించింది. వీటిలో 71 లాంచ్ మిషన్లు కాగా రెండు రీఎంట్రీ మిషన్ల ప్రయోగం ఇస్రో ఆధ్వర్యంలో జరిగింది. ఇస్రో (ISRO) స్థాపించిన తొలి రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం కోసం ఇండియా విదేశాలపై ఆధారపడి ఉండేది. 52 ఏళ్ల కాలగమనంలో ప్రస్తుతం ఇస్రో ప్రపంచంలోని అనేక దేశాలకు తమ ఉపగ్రహాలను మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే స్థాయికి చేరుకుంది. ఇస్రో ఇప్పటివరకు 226 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. వీటిలో 179 విదేశాలకు చెందిన ఉపగ్రహాలు కావడం నిదర్శనంగా నిలుస్తోంది 2017 సంవత్సరంలో రాకెట్ ప్రయోగం 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇందులో 96 ఉపగ్రహాలు అగ్రరాజ్యం అమెరికా (AMERICA)కు చెందినవి కావడం మరింత విశేషం.