గులాం నబీ ఆజాద్ కి ప్రధాని మోదీ కన్నీటి వీడ్కోలు, ‘కళాత్మకమైన ప్రదర్శన’, శశిథరూర్ సెటైర్
రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ కి ప్రధాని మోదీ భావోద్వేగంతో వీడ్కోలు పలకడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ 'కళాత్మకమైన ప్రదర్శన' గా అభివర్ణించారు.
రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ కి ప్రధాని మోదీ భావోద్వేగంతో వీడ్కోలు పలకడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘కళాత్మకమైన ప్రదర్శన’ గా అభివర్ణించారు. రాజ్యసభ సభ్యత్వం ముగుస్తున్న ఆజాద్ కు వీడ్కోలు పలుకుతూ,ఆయనతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ గత మంగళవారం మోదీ సభలో కంట తడి పెట్టారు. దీనిపై శశిథరూర్ స్పందించారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ రాసిన పుస్తకంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. మోదీ భావ ప్రదర్శన కళాత్మకమైనదిగా పేర్కొన్నారు. రైతు నేత రాకేష్ టికాయత్ కన్నీరు పెడితే మోదీ తాను కూడా కన్నీరు పెట్టాలని నిర్ణయించుకున్నారని థరూర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రైతుల నిరసనలపై ఘాజీపూర్ బోర్డర్ లో ఇటీవల మాట్లాడిన తికాయత్.. కంట తడి పెట్టిన విషయం గమనార్హం. కాగా గులాం నబీ ఆజాద్ కి, తనకు మధ్య సుదీర్ఘ కాలంగా ఉన్న అనుబంధాన్ని మోదీ ఇటీవల భావోద్వేగంతో మాట్లాడారు. ఒకప్పుడు గుజరాత్ కు తాను, జమ్మూ కాశ్మీర్ కు ఆజాద్ సీఎం లు గా ఉన్నపుడు జరిగిన ఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు. 2007 లో జరిగిన జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడిని ఆయన ప్రస్తావించారు.
Read More: రైతుల నిరసనలపై తప్పుడు సమాచారం, ట్విటర్ ప్రతినిధులతో భేటీలో ఐటీ శాఖ కార్యదర్శి విచారం