Arvind Kejriwal: గుజరాత్ లో పాగా వేసేందుకు ఆప్ ప్లాన్.. ఉచిత విద్యుత్తు హామీతో ప్రజలను ఆకట్టుకునేందుకు కేజ్రీవాల్ యత్నం..

| Edited By: Janardhan Veluru

Aug 16, 2022 | 5:49 PM

రెండు రోజుల పర్యటన నిమిత్తం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. గుజరాత్ పర్యటన వేళ ఆమాద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్ ఎన్నికలకు ఆపార్టీ అనుసరించబోయే వ్యూహాలను తెలియజేస్తోంది

Arvind Kejriwal: గుజరాత్ లో పాగా వేసేందుకు ఆప్ ప్లాన్.. ఉచిత విద్యుత్తు హామీతో ప్రజలను ఆకట్టుకునేందుకు కేజ్రీవాల్ యత్నం..
Arvind Kejriwal
Follow us on

AAP Chief Kejriwal Gujarat Tour: దేశ రాజధాని ఢిల్లీ తర్వాత పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన ఆమాద్మీ పార్టీ తన నెక్ట్స్ టార్గెట్ ను గుజరాత్ గా పెట్టుకుంది. దీంతో ఆపార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈఏడాది చివరిలో జరగబోయే గుజరాత్ శాసనసభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. తరచూ గుజరాత్ లో పర్యటించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. దీనిలో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. గుజరాత్ పర్యటన వేళ ఆమాద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్ ఎన్నికలకు ఆపార్టీ అనుసరించబోయే వ్యూహాలను తెలియజేస్తోంది. 300 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించే వారికి జీరో కరెంట్ బిల్లుపై ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీ తర్వాత జీరో ఎలక్ట్రసిటీ బిల్లుతో పంజాబ్ ప్రజలు సంతోషంగా ఉన్నారని..త్వరలో గుజరాత్ ప్రజలు ఈసంతోషాన్ని పొందబోతున్నారని హిందీలో ట్వీట్ చేశారు. తాము స్నేహితుల రుణాలు మాఫీ చేయబోమని..పేద ప్రజల విద్యుత్తు బిల్లులను మాఫీ చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలు తమతో ఉన్నారని.. జీరో ఎలక్ట్రసిటి బిల్లు మిరాకిల్ కు గుజరాత్ చాలా దగ్గర్లో ఉందని అయితే దీనికి సంబంధించిన కీ ప్రజల చేతిలో ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ లో పర్యటిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ శనివారం మద్యాహ్నం జామ్ నగర్ లోని టౌన్ హాలులో వ్యాపారులు, దుకాణదారులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే వ్యాపారులు, దుకాణాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు గుజరాత్ లోని ఆదీవాసీల ప్రాబల్యం అధికంగా ఉండే చోటౌడేపూర్ జిల్లాలోని బోడేలి పట్టణంలో ఆదివారం జరిగే బహిరంగ సభలో అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో ఈసభ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. ఆమాద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గుజరాత్ రాష్ట్రంలో 300 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగదారులు ఎటువంటి కరెంట్ బిల్లు చెల్లించనవసరం లేదని, నిరుద్యోగ యువతకు నెలవారీ నిరుద్యోగభృతి వంటి హామీలను గతంలోనే ప్రకటించారు.

ఇదిలా ఉండగా పంజాబ్ లో ఉచిత విద్యుత్తు పథకంలో లబ్ధిపొందిన వారి వివరాలను ఆరాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి హర్భజన్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలోని దాదాపు 80% మంది విద్యుత్తు వినియోగదారులు ఉచిత విద్యుత్తు పథకంలో లబ్ధిపొందారన్నారు. పది లక్షల మంది విద్యుత్తు వినియోగదారులకు 8లక్షల మంది జీరో విద్యుత్తు బిల్లును పొందారని, ఇలా మొత్తంగా 74లక్షల50వేల మంది వినియోగదారులు ఉచిత విద్యుత్తు పథకంలో ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. సొసైటీలో అన్ని వర్గాల ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఉచిత విద్యుత్తు పథకం ఉత్తమమైన మార్గమని హర్భజన్ సింగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి