ప్రధాని మోదీతో రేపు వేదికనెక్కనున్న నటుడుమిథున్ చక్రవర్తి? బీజేపీలో చేరుతారా ?
ప్రధాని మోదీ ఆదివారం కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్నర్యాలీలో పాల్గొనబోతున్నారు. సుమారు 10 లక్షల మందితో ఈ సభను బీజేపీ నిర్వహించబోతున్నదని వార్తలు వస్తున్నాయి.
ప్రధాని మోదీ ఆదివారం కోల్ కతా లోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్నర్యాలీలో పాల్గొనబోతున్నారు. సుమారు 10 లక్షల మందితో ఈ సభను బీజేపీ నిర్వహించబోతున్నదని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం పార్టీ అన్ని సన్నాహాలు చేస్తోంది. పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయడమే గాక.. స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ మోదీకి వివరణాత్మక నివేదికను ఇచ్ఛే కృషిలో నిమగ్నమయ్యారు. కాగా బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి రేపు మోదీతో బాటు వేదికనెక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. బెంగాల్ లో మంచి పాపులారిటీ కలిగిన ఈ నటుడు గతంలో తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే శారదా చిట్ ఫండ్ స్కామ్ లో ఈయనపై ఆరోపణలు రావడంతో ఈయనపై ఈడీ దర్యాప్తు జరిపింది. ఈ కుంభకోణంలోనాడు రూ.1.2 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు వార్తలు వచ్చ్చాయి. అయితే ఈ మొత్తాన్ని మిథున్ అప్పగించారని, ఆరోగ్య కారణాలు చూపి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని నాడే వార్తలు పతాక శీర్షికలకెక్కాయి.
ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముంబైలోని మిథున్ నివాసంలో ఆయనను కలుసుకుని సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. తమ మధ్య రాజకీయ చర్చలు జరగలేదని, తమ ఇంటికి ఆయన రావడం గతంలో తమ మధ్య కుదిరిన చిన్న అంగీకారమేనని మిథున్ చెప్పారు. బహుశా బీజేపీకి ఈ నటుడిని దగ్గర చేర్చేందుకే మోహన్ భగవత్ ఆయనను కలిశారన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు సినీ సెలబ్రిటీలను వినియోగించుకునే క్రమంలో బీజేపీ మిథున్ ని కూడా ఇందుకు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బెంగాల్ లో మిథున్ చక్రవర్తికి వేలాది అభిమానులున్నారు. ఆ రాష్ట్ర మూవీల్లో ఆయన నటించడమే గాక పలు, టీవీ షో లకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. కాగా రేపు ఆయన మోదీతో కలిసి వేదికనెక్కుతారా లేక తృణమూల్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా అన్నది తేలాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
ఇదెక్కడి విడ్డూరం.. ఆ ఇంటి అద్దె రూ.1.26 కోట్లట..: The Rent of the house is Rs 1.26 crore Video.