
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచారపల్లిలో ప్రభుత్వ బస్సు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. తిరుచ్చి నుంచి చెన్నై వెళ్తున్న ప్రభుత్వ బస్సు రాత్రి 8 గంటల సమయంలో కడలూర్ జిల్లా ఎళుత్తూర్ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ముందు టైరు అకస్మాత్తుగా పేలింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు రహదారిపైకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన తీరుకు స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. స్థానికులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుచ్చి నుండి చైన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..