LPG Cylinder Blast: కొంపముంచిన అక్రమ వ్యాపారం..! గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు దుర్మరణం.. 16 మందికి..

గ్యాస్ సిలిండ‌ర్లు పేలి న‌లుగురు దుర్మరణం చెందారు. 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

LPG Cylinder Blast: కొంపముంచిన అక్రమ వ్యాపారం..! గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు దుర్మరణం.. 16 మందికి..
Cylinder Blast In Jodhpur

Updated on: Oct 08, 2022 | 6:23 PM

గ్యాస్ సిలిండ‌ర్లు పేలి న‌లుగురు దుర్మరణం చెందారు. 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషాద ఘటన రాజ‌స్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. జోధ్‌పూర్‌లోని మాగ్రా పుంజ్లా ప్రాంతం కీర్తి న‌గ‌ర్ ఏరియాలోని ఓ బహుళ అంతస్థుల భవనంలో శనివారం పేలుడు సంభవించింది. బాధితులంతా సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు. ఈ పేలుడులో 16 మంది గాయపడ్డారని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జోధ్‌పూర్‌లోని మహాత్మాగాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

స్థానికుల సమాచారంతో అధికార యంత్రాంగం హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుంది. ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. మృతదేహాలను అగ్నిమాపక దళ సిబ్బంది బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు గుప్తా వెల్లడించారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అక్రమ పద్ధతిలో సిలిండర్లను ఒక సిలిండర్ నుంచి మరొక సిలిండర్‌కు రీఫిల్ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించినట్లు పేర్కొంటున్నారు. మొత్తం ఆరు సిలిండర్లు పేలాయని అధికారులు తెలిపారు. 2 పిల్లలతో సహా నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భారీ పేలుడుతో ఈ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది.

ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. జోధ్‌పూర్‌లోని మాగ్రా పూంజ్లా ప్రాంతంలోని కీర్తి నగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు మరణించడం, చాలా మందికి గాయాలు కావడం బాధాకరమంటూ పేర్కొన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..