
అహ్మదాబాద్, మార్చి 6: రీల్ పిచ్చి ముగ్గురు యువకుల ప్రాణం తీసింది. వాస్నా-సర్ఖేజ్ సమీపంలోని ఫతేవాడి కాలువ సమీపంలో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. రీల్స్ చేస్తుండగా స్కార్పియో కారు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. రోడ్డుపై యు-టర్న్ తీసుకుంటుండగా కాలువలో కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు కాలువలో గల్లంతయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వాస్నా బ్యారేజీకి కొద్ది దూరంలో యష్ భంకోడియా కారు నడిపాడు. ఆ తర్వాత కారును యష్ సోలంకికి నడపమని ఇచ్చాడు. క్రిష్ డేవ్ కూడా కారులో కూర్చున్నాడు. ముగ్గురు స్నేహితులు యు-టర్న్ తీసుకునే క్రమంలో కారును వెనక్కి తీసుకువస్తున్నారు. కానీ ఏదో కారణం చేత కారు మలుపు తిరగడానికి బదులుగా ఎదురుగా ఉన్న కాలువలోకి కారు నేరుగా దూసుకెళ్లింది. ప్రమాదానికి గురైన కారులో నలుగురు మైనర్లు ఉన్నారని, వారిలో రెస్క్యూ టీం ఒకరిని మాత్రమే రక్షించగలిగారు. మిలిగిన క్రిష్, యష్, యక్ష్ అనే ముగ్గురు మైనర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.11వ తరగతి చదువుతున్న ఈ మైనర్లు రీల్ కోసమని కారును అద్దెకు తీసుకున్నారని వెల్లడించారు. అయితే కారు యజమాని దీనిని ఖండించారు.
అస్లాలి, ప్రహ్లాద్నగర్, జమాల్పూర్కు చెందిన 30 మంది అగ్నిమాపక దళం సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. వాస్నా బ్యారేజీ నుంచి కాలువలోకి ప్రవహించే నీటిని నిలిపి వేసి.. గంటల తరబడి చేపట్టిన ప్రయత్నాల తర్వాత రెస్క్యూ టీం స్కార్పియో కారును ఒడ్డుకు తీసుకురాగలిగింది. కాలువలో గల్లంతైన యక్ష్ భంకోడియా, యష్ సోలంకి అనే ఇద్దరు మైనర్ల మృతదేహాలను వెలికి తీశారు. మూడో బాలుడు క్రిష్ డేవ్ కోసం ఇంకా గాలిస్తున్నారు. మృతుల్లో ఎవరికీ కారు నడపడం తెలియదని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు.
కారు ఓనర్ సౌరభ్ గుప్తా మాట్లాడుతూ.. ఫతేవాడి కాలువలో రీల్స్ చేస్తుండగా స్కార్పియో కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకుపోయిందని పోలీసులకు తెలిపాడు. తాను కారును ఎవరికీ అద్దెకు ఇవ్వలేదనీ.. తన స్నేహితుడు మౌలిక్ అనే వ్యక్తి కారును తీసుకువెళ్లాడని అన్నాడు. అయితే మౌలిక్ తన స్నేహితుడు రూద్రకు ఫోటోల కోసమని కారు ఇచ్చాడు. కానీ రుద్రకు లైసెన్స్ లేకపోవడంతో అతని స్నేహితులు వచ్చి కారును తీసుకు వెళ్లారని పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.