COVID-19 vaccine: వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ మంచిదే.. భయపడాల్సిన పని లేదన్న ఎయిమ్స్ డైరెక్టర్
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఇన్ఫెక్షన్ వచ్చినా మేలేనని, అది శుభ సంకేతమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా వెల్లడించారు. శరీరంలోని ఇమ్యూన్ వ్యవస్థ వ్యాక్సిన్కు స్పందిస్తోందని...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత స్వల్పంగా ఇన్ఫెక్షన్ వచ్చినా మేలేనని, అది శుభ సంకేతమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా వెల్లడించారు. శరీరంలోని ఇమ్యూన్ వ్యవస్థ వ్యాక్సిన్కు స్పందిస్తోందని, యాంటీబాడీస్ తయారు కానున్నాయని చెప్పడానికి ఇవి సంకేతాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా మొదటిరోజు వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో డాక్టర్ గులేరియా కూడా ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించిన వెంటనే దేశంలోనే మొదటిగా ఎయిమ్స్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. తొలి టీకాను పారుశుద్ధ్య కార్మికుడు మనీష్ కుమార్ తీసుకున్నారు. కాగా, మూడవ వ్యక్తిగా గులేరియా టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ స్ట్రాటజీపై ప్రభుత్వ ప్యానల్కు సారథ్యం వహిస్తున్న డాక్టర్ పాల్ సైతం వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న గంట తర్వాత డాక్టర్ గులేరియా తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, వ్యాక్సినేషన్ తీసుకున్న గంటన్నర తర్వాత కూడా తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని చెప్పారు.
సేఫ్టీ విషయంలో కొవాక్సిన్, కొవిషీల్డ్ రెండూ ఒకటేనని, ప్రజలు ఎంతమాత్రం వ్యాక్సినేషన్కు భయపడాల్సిన పని లేదని డా. గులేరియా స్పష్టం చేశారు. అలాగే మైల్డ్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన ప్రశ్నలపై ఆయన మరింత వివరణ ఇచ్చారు. స్వల్పంగా జ్వరం రావడం, ఒళ్లు నొప్పులు, కండరాల నెప్పులు వంటివి ఒకటి, రెండ్రోజులు ఉండొచ్చని, ఆ తర్వాత తగ్గిపోతాయని చెప్పారు. భయపడాల్సిన పని లేదని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం జనం పెరుగుతూ వస్తున్నప్పుడు సామాజిక దూరం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.