మద్యం కోసం క్వారంటైన్ సెంటర్ కంచెను కట్ చేసి వెళ్లిన వ్యక్తి
కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాలు క్వారంటైన్ సెంటర్లను మెయింటెన్ చేస్తోన్న విషయం తెలిసిందే. బయటి నుంచి వచ్చిన వ్యక్తులను అందులో ఉంచుతూ, టెస్ట్లు నిర్వహించి కరోనా వ్యాప్తికి బ్రేక్ వేస్తున్నారు.
కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాలు క్వారంటైన్ సెంటర్లను మెయింటెన్ చేస్తోన్న విషయం తెలిసిందే. బయటి నుంచి వచ్చిన వ్యక్తులను అందులో ఉంచుతూ, టెస్ట్లు నిర్వహించి కరోనా వ్యాప్తికి బ్రేక్ వేస్తున్నారు. అయితే అందులో ఉండేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. చిన్న చిన్న కారణాలు చెబుతూ అక్కడి నుంచి పారిపోతున్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యం కోసం క్వారంటైన్ సెంటర్ కంచెను కట్ చేసి వెళ్లాడు ఓ వ్యక్తి. ఈ ఘటన న్యూజిలాండ్లో జరిగింది.
గత బుధవారం సిడ్నీ నుంచి వచ్చిన మార్టిన్ మెక్వికర్(52)ని హమిల్టన్లోని ఓ క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. అయితే మద్యం కోసం బయటకు వెళ్లాలనుకున్న అతడు 1.8 మీటర్ల మేర కంచెను కట్ చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆ తరువాత దగ్గర్లోని లిక్కర్ స్టోర్ దగ్గరకు వెళ్లి మద్యం కొనుగోలు చేశారు. దాదాపు అరగంట తరువాత ఆ వ్యక్తి తిరిగి క్వారంటైన్ సెంటర్కి చేరుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతడికి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించడంతో.. ప్రస్తుతం పోలీసుల అదుపులో మార్టిన్ ఉన్నాడు. కాగా ఇప్పటివరకు అతడికి మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చినట్లు తేలినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయినా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతడితో కాంటాక్ట్ అయిన వారి వివరాలను పోలీసులు కనుగొంటున్నారు.
కాగా ఆ మధ్యన కరోనాను జయించినట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. అయితే ఆ తరువాత విదేశాల నుంచి ఆ దేశానికి రాకలు ప్రారంభం కావడంతో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వేరే ప్రదేశాల నుంచి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్ని తప్పనిసరి చేశారు. అయితే అందులో ఉన్న వారు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి క్వారంటైన్ నుంచి తప్పించుకొని షాపింగ్ చేసి వచ్చాడు. ఆ తరువాత జరిపిన పరీక్షల్లో అతడికి పాజిటివ్గా తేలింది. అలాగే ఓ మహిళ సైతం క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకొని చివరకు పోలీసులనే అడ్రస్ అడగడంతో వారికి చిక్కింది.