
తమ బాల్కనీలో పచ్చగా, దట్టంగా పెరిగిన మిరప మొక్కను చూడటానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి..తాజా, సేంద్రియ మిరపకాయలకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కానీ, కొన్నిసార్లు మిరప మొక్క నాటిన తర్వాత దానికి కాయలు సరిగా రావు..పూత కూడా తరచూ రాలిపోతూ ఉంటుంది. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, చింతించకండి. మీ మిరప మొక్కలకు ఎప్పుడూ మిరపకాయలు నిండుగా కాసేలా చేయడానికి, తోటపని నిపుణులు ఒక సులభమైన, ప్రభావవంతమైన రహస్యాన్ని వెల్లడించారు. ఇంట్లోనే కుండీలలో పచ్చిమిర్చి మొక్కలను ఆరోగ్యంగా పెంచడానికి, ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించడానికి కొన్ని సులువైన చిట్కాలు ఉన్నాయి.
మిర్చి మొక్కలను నాటడానికి మంచి నాణ్యమైన విత్తనాలను లేదా నారును ఎంచుకోవాలి. కుండీలో వేసే మట్టి మిశ్రమంలో 50శాతం సాధారణ తోట మట్టి, 30శాతం వర్మీకంపోస్ట్ లేదా పశువుల ఎరువు, మరియు 20శాతం ఇసుక లేదా కోకోపిట్ కలపాలి. దీనివల్ల మట్టి లూజ్గా ఉండి వేర్లు బాగా విస్తరిస్తాయి. మిర్చి మొక్కకు సూర్యరశ్మి చాలా అవసరం. కాబట్టి, రోజుకు కనీసం 5 నుండి 6 గంటల పాటు ఎండ తగిలే ప్రదేశంలో కుండీలను ఉంచాలి.
మిర్చి మొక్కలకు పూత వచ్చే దశ చాలా సున్నితమైనది. ఈ సమయంలో చిన్న తప్పు చేసినా పూత మొత్తం రాలిపోయి కాయలు కాయవు.
నీటి నిర్వహణ: మొక్కకు పూత రావడం ప్రారంభం కాగానే నీరు పెట్టడం కొద్దిగా తగ్గించాలి. మట్టి పైపొర ఎండిపోయినట్లు అనిపిస్తేనే నీరు ఇవ్వాలి. పూత దశలో ఎక్కువ నీరు పోస్తే వేర్లు బలహీనపడి పూత రాలిపోతుంది. అలాగే మరీ తక్కువ నీరు పోసినా పూత ఎండిపోతుంది.
పోషకాల లోపం: మొక్కకు సరైన పోషకాలు అందనప్పుడు కూడా పూత నిలవదు. దీనికోసం ఆవాల పిండిని (Mustard cake) నీటిలో 2-3 రోజులు నానబెట్టి, ఆ ద్రావణాన్ని పలచగా చేసి మొక్కల మొదట్లో పోయాలి. ఇది మొక్కకు అద్భుతమైన నైట్రోజన్, పొటాషియం పోషకాలను అందిస్తుంది.
సహజసిద్ధమైన స్ప్రే: వారానికి ఒకసారి పుల్లటి మజ్జిగను నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చేయడం వల్ల చీడపీడలు ఆశించవు. పూత రాలడం తగ్గుతుంది.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు, సహజసిద్ధమైన ఎరువులను ఉపయోగించడం ద్వారా మీ ఇంట్లోని మిర్చి మొక్కలు పూత రాలకుండా, పచ్చటి మిరపకాయలతో కళకళలాడుతాయి. ఏపుగా పెరిగే కొమ్మలను అప్పుడప్పుడు ప్రూనింగ్ చేయడం ద్వారా మరిన్ని కొత్త కొమ్మలు వచ్చి దిగుబడి మరింత పెరుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..