
భారతీయ సంప్రదాయంలో, ఆయుర్వేదంలో నవజాత శిశువులకు నూనెతో మసాజ్ (అభ్యంగన స్నానం) చేయడం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. క్రమం తప్పకుండా శిశువుకు ఆయిల్ మసాజ్ చేయటం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు సరైన పద్ధతిలో అందుతాయి. ఇది శిశువుల కండరాలను దృఢంగా మార్చి, శారీరక ఎదుగుదలకు సహాయపడుతుంది.
మసాజ్ చేయడం వల్ల పిల్లల శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. దీనివల్ల వారు త్వరగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. శిశువుల మెదడు వికాసానికి మంచి నిద్ర ఎంతో అవసరం.
చిన్న పిల్లలలో జీర్ణవ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. అందువల్ల, పొత్తికడుపుపై తేలికపాటి చేతులతో మసాజ్ చేయడం వల్ల గ్యాస్, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
శిశువు జన్మించిన వెంటనే మసాజ్ చేయడం మంచిది కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, డెలివరీ అయిన 2 నుండి 3 వారాల తర్వాత లేదా బాబు/పాపకు ఒక నెల నిండిన తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయడం ప్రారంభించవచ్చు.
వాతావరణాన్ని బట్టి నూనెలను ఎంచుకోవాలి. శీతాకాలంలో నువ్వుల నూనె లేదా ఆవనూనె, వేసవి కాలంలో అయితే చలువ చేసే కొబ్బరి నూనెను ఉపయోగించడం మంచిది. మసాజ్ ఎప్పుడూ చాలా తేలికపాటి చేతులతో, గట్టిగా ఒత్తకుండా చేయాలి. ఎందుకంటే చిన్న పిల్లల చర్మం, ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి. మసాజ్ పూర్తయిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. ఒకవేళ నూనె వల్ల చర్మంపై ఎరుపు దద్దుర్లు వంటి అలర్జీలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..