
పండుగలు, శుభకార్యాల సమయంలో స్వీట్లపై మెరిసే వెండి పూత చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ వెండి పూత శాకాహారమా లేక మాంసాహారమా అనే సందేహం చాలామందిలో ఉంది. నిపుణులు ఏం చెబుతున్నారంటే.. పూర్వకాలంలో వెండిని అత్యంత పతలాగా, సన్నని రేకులా మార్చడం చాలా కష్టమైన పనిగా ఉండేది. అందుకోసం వెండి బిళ్ళలను జంతువుల చర్మ పొరల మధ్య ఉంచి, తోలు సంచుల్లో పెట్టి చాలా గంటల పాటు సుత్తితో గట్టిగా కొట్టేవారు. ఈ ప్రక్రియలో జంతువుల అవశేషాలు వెండి రేకులకు అంటుకునే అవకాశం ఉండేది. ఈ సాంప్రదాయ తయారీ విధానం కారణంగానే వెండి పూతను నాన్-వెజిటేరియన్గా పరిగణించేవారు.
కాలక్రమేణా ప్రజలలో అవగాహన పెరగడం, జంతు హింసను అరికట్టడానికి భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ప్రస్తుతం వెండి పూతను తయారు చేయడానికి జంతువుల పేగులను వాడటంపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు ఆటోమేటిక్ జర్మన్ యంత్రాల సహాయంతో, కాగితం లేదా ప్లాస్టిక్ షీట్ల మధ్య వెండిని ఉంచి పరిశుభ్రంగా తయారుచేస్తున్నారు. ప్రసిద్ధ, నాణ్యమైన స్వీట్ షాపులలో లభించే వెండి పూత ఇప్పుడు పూర్తిగా శాకాహార పద్ధతిలోనే తయారవుతోంది.
అయితే, మార్కెట్లో లభించే కొన్ని చౌకబారు లేదా నాణ్యత లేని స్వీట్లలో వెండికి బదులుగా అల్యూమినియం పూతను వాడటం లేదా నాసిరకం వెండిని ఉపయోగించడం జరుగుతోంది. అల్యూమినియం పూత ఆరోగ్యానాకి తీవ్ర హానికరం. ప్రస్తుతం విక్రయించే బ్రాండెడ్, గుర్తింపు పొందిన షాపుల మిఠాయిలలో ఉండే వెండి పూత పూర్తిగా శాకాహార యంత్ర పద్ధతిలోనే తయారవుతోంది. కాబట్టి, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) గుర్తింపు పొందిన మిఠాయిలను కొనుగోలు చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య లేదా మతపరమైన ఆందోళనలు లేకుండా స్వీట్లను ఆస్వాదించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..