
ఎండలు ముదురుతున్న వేళ డీహైడ్రేషన్ను నివారించడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి డ్రింక్ కొబ్బరి నీళ్లు. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ పానీయం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఆరోగ్యం కోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగే అలవాటు ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా జీవక్రియను మెరుగుపరుస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన డీటాక్స్ డ్రింక్. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
కొబ్బరి నీళ్లు అందరికీ మేలు చేస్తాయనుకోవడం పొరపాటని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు:
కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును మరింత తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి, లో-బీపీ ఉన్నవారు ఖాళీ కడుపుతో వీటిని తాగితే తలతిరుగుడు లేదా బలహీనత వంటి సమస్యలు ఎదుర్కోవచ్చు.
కొబ్బరి నీళ్లలో సహజ చక్కెరలు ఉంటాయి. ఖాళీ కడుపుతో తాగినప్పుడు శరీరం వీటిని వేగంగా గ్రహిస్తుంది, దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. షుగర్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకే వీటిని తీసుకోవాలి.
కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొబ్బరి నీళ్లలోని అదనపు పొటాషియం హానికరం కావచ్చు. పొటాషియం స్థాయిలు పెరిగితే కిడ్నీలపై భారం పడుతుంది.
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే గ్యాస్, కడుపు నొప్పి లేదా విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.
డాక్టర్ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కొబ్బరి నీళ్లను ఎప్పుడూ తాజాగా ఉన్నప్పుడే తాగాలి. మరీ చల్లగా ఉన్నవి తీసుకోకపోవడమే మంచిది. రోజుకు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు సరిపోతాయి. ఏదైనా అనారోగ్య సమస్యతో మందులు వాడుతున్న వారు, తమ ఆహారంలో కొబ్బరి నీళ్లను చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.