
పీఎన్ఏఎస్ నెక్సస్ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం, స్మార్ట్ఫోన్ ద్వారా చేసే కాల్స్ లేదా మెసేజ్ల కంటే.. నిరంతరం ఉండే ఇంటర్నెట్ కనెక్టివిటీయే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రముఖ అమెరికన్ సైకియాట్రిస్ట్ డాక్టర్ డానియల్ జి. ఆమెన్ ఈ ఫలితాలను ‘మెదడుకు రీబూట్’ (Reboot) వంటిదని అభివర్ణించారు. స్మార్ట్ఫోన్ నుంచి డేటాను కొన్నాళ్ల పాటు దూరం చేయడం వల్ల ఏకాగ్రత పెరగడమే కాకుండా, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు కూడా మాయమవుతాయని ఈ స్టడీ వెల్లడిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
పరిశోధనలో వెల్లడైన కీలక అంశాలివే:
ఇంటర్నెట్ నియంత్రణ: సుమారు 400 మందిపై చేసిన ప్రయోగంలో.. రెండు వారాల పాటు ఫోన్లో కాల్స్, మెసేజ్లు అనుమతించి, కేవలం ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేశారు. దీనివల్ల వారిలో ఏకాగ్రత (Sustained Attention) అద్భుతంగా పెరిగినట్లు గుర్తించారు.
వయస్సులో మార్పు: ఈ మార్పు ఎంత గొప్పగా ఉందంటే, వారి మెదడు పనితీరు పదేళ్ల చిన్న వయస్సు ఉన్నవారి మెదడు మాదిరిగా చురుగ్గా మారింది.
సామాజిక సంబంధాలు: ఆన్లైన్ ప్రపంచానికి దూరంగా ఉండటం వల్ల, ప్రజలు ఇతరులతో ముఖాముఖి మాట్లాడటానికి ఎక్కువ సమయం కేటాయించారు. ఇది మెదడు అభివృద్ధికి మానసిక దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుందని తేలింది.
అదనపు ప్రయోజనాలు: ఇంటర్నెట్ వాడకం తగ్గించిన వారిలో ఆందోళన తగ్గిందని, వారు ప్రశాంతంగా నిద్రపోతున్నారని పరిశోధకులు గుర్తించారు. ఈ సానుకూల ప్రభావాలు ప్రయోగం ముగిసిన కొన్ని నెలల వరకు కొనసాగడం విశేషం.
డాక్టర్ ఆమెన్ సలహా:
“మీ ఫోన్ స్మార్ట్గా ఉండాలి కానీ, మీ మెదడు దానికంటే స్మార్ట్గా ఉండాలి. మీ ఆలోచనలు చెల్లాచెదురుగా ఉంటే లేదా మీరు నిరంతరం బాధగా అనిపిస్తే.. కేవలం రెండు వారాల పాటు మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చేసి చూడండి. ఇది మీరు చేయగలిగే అత్యంత తెలివైన పని” అని ఆయన పేర్కొన్నారు.