ఫిబ్రవరి నెల చివరికి వచ్చేసింది. అంటే విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన 'పరీక్షల' సమయం దాదాపు వచ్చేసినట్టే. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ప్రారంభం కావడం, వెనువెంటనే పదో తరగతి పరీక్షలు కూడా రానుండటంతో ఇళ్లలో వాతావరణం అంతా కాస్త సీరియస్గా మారిపోయింది.
కేవలం విద్యార్థులే కాదు, తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. అయితే, ఈ ఒత్తిడి చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పరీక్షల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, చదివింది గుర్తుంచుకోవడానికి నిపుణులు సూచిస్తున్న 7 అద్భుతమైన చిట్కాలేంటో చూద్దాం..
చాలామంది విద్యార్థులు ఏడాది పొడవునా కష్టపడి చదువుతారు. కానీ, పరీక్షల సమయం వచ్చేసరికి ఏది చదవాలో అర్థం కాక, విపరీతమైన ఆందోళనతో చదివింది కూడా మర్చిపోతుంటారు. సరిగ్గా భోజనం చేయకపోవడం, నిద్రపోకుండా పుస్తకాలతో కుస్తీ పట్టడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని, చివరి నిమిషంలో పరీక్ష రాయలేని పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం వేసవి కాలం కూడా మొదలవుతోంది. మరి ఈ మారుతున్న కాలంలో, పరీక్షల ఒత్తిడిని జయించి విజయం సాధించడం ఎలా?
పరీక్షల సమయంలో ఆకలిని చంపుకుని చదవడం అత్యంత ప్రమాదకరం. మెదడు చురుగ్గా పనిచేయాలంటే సరైన పోషకాలు అందాలి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా తాజా పండ్లు, ఆకుకూరలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
చివరి నిమిషంలో కొత్త పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నించి టెన్షన్ పడకండి. ఇప్పటికే చదివిన అంశాలను మళ్ళీ రివైజ్ చేసుకోవడమే ఉత్తమం. దీనివల్ల సమయం ఆదా అవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజుకు కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ప్రస్తుతం ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి, శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి ధారాళంగా నీరు తాగాలి. శ్వాస సంబంధిత వ్యాయామాలు మెదడుకు ఆక్సిజన్ను అందించి ప్రశాంతంగా ఉంచుతాయి.
రాత్రంతా మేల్కొని చదవడం వల్ల మెదడు అలసిపోతుంది. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ప్రతిరోజూ కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా ఉంటేనే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో ముందుగానే ఒక క్యాలెండర్ సిద్ధం చేసుకోవాలి. పరీక్ష తేదీలు, హాల్ టికెట్ వంటివి అందుబాటులో ఉంచుకోవడం వల్ల చివరి నిమిషంలో కంగారు పడాల్సిన అవసరం ఉండదు.
మనం ఒక్కరిమే చదవడం కంటే, ఒకే విషయాన్ని స్నేహితులతో చర్చించడం వల్ల అది మెదడులో బలంగా ముద్రించబడుతుంది. తోటి విద్యార్థులతో సందేహాలను పంచుకోవడం వల్ల సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుంది.
గంటల తరబడి ఏకధాటిగా చదవడం వల్ల ఫలితం ఉండదు. ప్రతి 40-50 నిమిషాల చదువు తర్వాత ఒక 5-10 నిమిషాల విరామం తీసుకోవాలి. ఈ బ్రేక్ సమయంలో నడవడం లేదా మ్యూజిక్ వినడం వల్ల మెదడు రీఫ్రెష్ అవుతుంది.
పరీక్షలు అనేవి మీ జీవితంలో ఒక భాగం మాత్రమే, అవే జీవితం కాదు. సానుకూల దృక్పథంతో పరీక్షలకు సిద్ధమవ్వండి. పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందే చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. మీ మానసిక ఆరోగ్యం బాగుంటే విజయం దానంతట అదే వరిస్తుంది.