తినడానికి ఫ్లైట్లో వచ్చేయడం ఏంటి భయ్యా? టేస్ట్ కోసం యూట్యూబర్ చేసిన పనికి షాక్
కష్టపడి సంపాదించేది తినడానికే కదా అనే మాట చాలా మంది చెబుతుంటారు. ప్రస్తుతం చాలా మంది తినడం కంటే సేవింగ్స్పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అయితే రుచికి ఫిదా అయితే మాత్రం ఎంత దూరమైనా వెళ్తూ, ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనకడుగు వేయడం లేదు.

హైదరాబాదీ బిర్యానీ అంటే కేవలం ఒక వంటకం కాదు, అదొక భావోద్వేగం. ఈ రుచికి సరిహద్దులు లేవు, దేశ విదేశాల్లో దీనికి కోట్లాది మంది అభిమానులున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట వంటి చారిత్రక కట్టడాలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు పర్యాటకులు కేవలం ఇక్కడి పాకశాస్త్ర కళను ఆస్వాదించడానికే విమానాలు ఎక్కి వస్తున్నారు.
‘నేను కేవలం బిర్యానీ తినడానికే హైదరాబాద్ వచ్చాను’ అని ఒక ప్రముఖ యూట్యూబర్ పెట్టిన వీడియోకు 5 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం చూస్తుంటే, నగర పర్యాటక రంగంలో బిర్యానీ ఎంతటి కీలక పాత్ర పోషిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 2019లో యునెస్కో హైదరాబాద్కు అందించిన ‘క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ’ హోదా ఈ ప్రాచుర్యాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే బిర్యానీ, బన్ మస్కా, పాయా వంటి వీడియోలే దర్శనమిస్తున్నాయి. చారిత్రక కట్టడాల కంటే నగరపు అమోఘమైన రుచులకే నేటి తరం పర్యాటకులు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో బిర్యానీ..
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూట్యూబర్స్ డైలీ మాక్స్, క్రిస్ లూయిస్ వంటి వారు హైదరాబాద్ వంటకాలపై ప్రత్యేక వీడియోలు రూపొందించి ఇక్కడి రుచులను విశ్వవ్యాప్తం చేశారు. అల్ఫోన్సో ఇంకా జెస్సికా వంటి జంటలు తమ ‘ఫుడ్ విష్ లిస్ట్’ పూర్తి చేయడానికి ప్రత్యేకంగా నగరాన్ని సందర్శిస్తున్నారు. ఇక ముంబైకి చెందిన చెఫ్ వెల్టన్ సల్దానా బిర్యానీ పట్ల తన భక్తిని చాటుకుంటూ వార్తల్లో నిలిచారు. ఆయన హైదరాబాద్ నుండి వెళుతూ రూ. 5,000 విలువైన బిర్యానీ ప్యాకెట్లను తీసుకెళ్లారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వాటిని విమానంలో తీసుకెళ్లడానికి ఆయన అదనంగా రూ. 4,200 సర్చార్జి చెల్లించారు. అంటే కేవలం బిర్యానీ కోసమే ఆయన దాదాపు రూ. 9,200 ఖర్చు చేయడం విశేషం.
ఫుడ్ టూరిజానికి కేరాఫ్..
కేవలం ఫుడ్ బ్లాగర్లే కాకుండా, దుబాయ్కు చెందిన ఖలీద్ అల్ అమెరి వంటి లైఫ్ స్టైల్ క్రియేటర్లు కూడా హైదరాబాద్ ఆహార సంస్కృతికి ముగ్ధులవుతున్నారు. భారతదేశంలోనే అత్యుత్తమ బిర్యానీని కనుగొనే క్రమంలో ఆయన నగరంలో గడిపిన 72 గంటల ప్రయాణం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి సైతం తెల్లవారుజామునే హోటల్ నయాబ్ను సందర్శించి పాయా, నహారీ రుచులను ఆస్వాదించడం ఒక మరపురాని అనుభవమని చెబుతున్నారు.
ప్రతి వారం ఏదో ఒక హైదరాబాదీ ఫుడ్ పోస్ట్ వైరల్ అవుతుండటాన్ని చూస్తుంటే, త్వరలోనే భారతదేశపు ఫుడ్ టూరిజం రాజధానిగా భాగ్యనగరం నిలవడం ఖాయమనిపిస్తోంది. హైదరాబాద్ బిర్యానీ రుచి వెనుక కొన్ని శతాబ్దాల చరిత్ర, సంస్కృతి దాగి ఉన్నాయి. ఆ రుచే ఇప్పుడు పర్యాటకులను ఆకర్షించే అయస్కాంతంలా మారింది. భాగ్యనగరపు పాకశాస్త్ర వైభవం భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ వేదికలపై మెరవనుంది.
