
వేసవి కాలం నుంచి వర్షాకాలం వరకూ లభించే నేరేడు పండు రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఇది ఒక సూపర్ ఫుడ్. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే చాలా మందికి నేరేడు పండ్లను ఎలా తినాలో తెలియదు. నేరేడు పండ్లను సరైన విధంగా తినక పోవడం కారణంగా .. వీటిని తినడం వలన కలిగే పూర్తి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఈ రోజు నేరేడు పండ్లను తినడానికి శాస్త్రీయ,సాంప్రదాయ పద్దతి ఏమిటో తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో తినవద్దు.
ఉదయం ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను తినడం హానికరం. ఇందులో ఉండే టానిక్ ఆమ్లం , ఆక్సాలిక్ ఆమ్లం కడుపులో గ్యాస్, ఆమ్లత్వం లేదా మంటను కలిగిస్తాయి. కనుక ఉదయం అల్పాహారం తర్వాత లేదా భోజనం చేసిన కొన్ని గంటల తర్వాత నేరేడు పండ్లను తింటే మంచిది.
ఉప్పు లేదా నల్ల ఉప్పు వేసి తినండి.
నేరేడు పండ్లు సహజంగానే కొంత వగరు రుచిని కలిగి ఉంటాయి. ఈ రుచి కొంతమందికి నచ్చదు. ఈ రుచిని తొలగించి జీర్ణక్రియకు సహాయపడటానికి నేరేడు పండ్లకు కొద్దిగా నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు జత చేసి తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. నేరేడు పండ్ల రుచిని పెంచడమే కాదు గ్యాస్, అజీర్ణ సమస్యను కూడా నివారిస్తుంది.
విత్తనాలను తొలగించి తినండి
నేరేడు పండ్ల గింజలు గట్టిగా ఉంటాయి. వీటిని నేరుగా తినే సమయంలో ఈ గింజలు మింగడం హానికరం. నేరేడు పండ్లను బాగా నమిలి.. నేరేడు విత్తనాలను వేరు చేయండి. అయితే నేరేడు పండ్ల గింజల్లో కూడా ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. కనుక వీటిని ఎండబెట్టి పొడి చేసుకుని తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
నేరేడు పండ్లను ఎక్కువగా తినొద్దు
నేరేడు పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో “చల్లని ప్రభావం” పెరుగుతుంది, ఇది గొంతు నొప్పి లేదా శ్లేష్మం ఏర్పడటానికి కారణమవుతుంది. చాలా మందికి రోజుకు 100–150 గ్రాములు (ఒక చిన్న గిన్నె) నేరేడు పండ్లు సరిపోతాయి.
పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులతో కలిపి తినవద్దు
పాలు లేదా ఇతర పాల ఉత్పత్తులతో కలిపి లేదా వీటిని తిన్న వెంటనే నేరేడు పండ్లను తినడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే రెండింటి స్వభావం భిన్నంగా ఉంటుంది . వాటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, తిమ్మిరి లేదా విరేచనాలు వస్తాయి.
పిల్లలు తినే సమయంలో జాగ్రత్త
పిల్లలకు నేరేడు పండ్లను ఇచ్చేటప్పుడు.. వారు విత్తనాలను మింగకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఇవి గొంతుకు అడ్డుపడి ఉక్కిరిబిక్కిరి అవుతారు. లేదా కడుపు సమస్యలను కలిగిస్తుంది. నేరేడు పండ్ల పురీని చిన్న పిల్లలకు ఇవ్వవచ్చు.
పసుపు, నేరేడు పండ్లను కలిపి తినవద్దు
పసుపు ఉన్న ఆహారాన్నితో పాటు లేదా.. పసుపు ఉన్న ఆహారం తిన్న తర్వాత వెంటనే నేరేడు పండ్లను తినకండి. పసుపు , నేరేడు పండ్లను కలిపి తినడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కడుపు చికాకుకు కారణమవుతుంది. అందువల్ల పసుపు ఉన్న ఆహారాన్ని తిన్న కనీసం 30 నిమిషాల తర్వాత నేరేడు పండ్లను తినండి.
నేరేడు పండ్లతో ఊరగాయని తినవద్దు
చాలా మంది ఆహారంతో పాటు ఊరగాయలు తినడానికి ఇష్టపడతారు. అయితే నేరేడు పండ్లని ఊరగాయను కలిపి తినడం లేదా నేరేడు పండ్లు తిన్న వెంటనే ఊరగాయని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. కడుపు నొప్పికి కారణమవుతుంది. కడుపులో గ్యాస్, మంట లేదా అజీర్ణం వంటి సమస్యలు సంభవించవచ్చు. కనుక నేరేడు పండ్లను తినేసమయంలో ఊరగాయని తినొద్దు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)