
కిడ్నీల్లో రాళ్లు ఉంటే వీపు, పొత్తికడుపు, నడుము భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ రకమైన సమస్య ఉంటే కూర్చోలేరు, నిలబడలేరు. మూత్ర విసర్జన చేసేటప్పుడు రక్తం రావడం, జ్వరం, వాంతులు కూడా వేదిస్తాయి. కానీ చాలా మంది ఈ రకమైన సమస్య తగినంత నీరు త్రాగకపోవడం వల్ల వస్తుందని అనుకుంటారు. కానీ మీరు తగినంత నీరు తాగినప్పటికీ కొన్ని ఆహారాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి. ముఖ్యంగా ఆక్సలేట్లు, సోడియం, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అందువల్ల ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. ఏయే ఆహారాలు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
పాలకూరలో సాధారణంగా ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. పాలకూరలోని ఆక్సలేట్ కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఇనుము స్థాయిలు తగ్గుతాయి. రక్తహీనత సమస్యలు కూడా వస్తాయి. బంగాళాదుంపలు కూడా అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
బాదం, కొన్ని రకాల గింజల్లో అధిక స్థాయిలో ఆక్సలేట్ ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ రకమైన ఆహారాలు కిడ్నీ లోపల ఖనిజాలు, లవణాలు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. దీనివల్ల సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు బాదం తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిలో ఆక్సలేట్ కంటెంట్ రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవారు ఎక్కువగా బాదం తినకూడదు.
మనం ప్రతిరోజూ వంటలో టమోటాలు ఉపయోగిస్తాం. ప్రతి వంటకంలోనూ వాటిని ఉపయోగిస్తాం. టమోటాలను కూరలు, సాస్లు మొదలైన వివిధ రూపాల్లో ఉపయోగిస్తాం. అయితే వండిన వాటికి బదులు పచ్చి టమోటాలను తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందట.
ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అంతే కాదు ప్యాక్ చేసిన ఆహారాలలో కూడా అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా పెరుగుతుంది.
అతిగా టీ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. టీలో ఆక్సలేట్లు మధ్యస్థం నుంచి అధిక స్థాయిలో ఉంటాయి. అవి విసర్జించబడినప్పుడు మూత్రంలో కాల్షియంతో కలిసిపోతాయి. ఫలితంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి.
చక్కెర పానీయాలు మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఉండే ఫాస్పోరిక్ ఆమ్లం దీనికి కారణం. చక్కెర పానీయాలు మూత్రంలో రాళ్లను ఏర్పరుస్తాయి. ఫ్రక్టోజ్ కూడా దీనికి కారణమవుతుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతుంది. వీటన్నిటి బదులు అధికంగా నీళ్లు తాగడంతోపాటు, సరైన జీవనశైలి అనుసరిస్తే మూత్రపిండాల ఆరోగ్యం రక్షించడంలో సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.