
ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే కొన్ని ఆహార జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ఒక నిర్దిష్ట స్థాయికి మించి పెరగకుండా ఉండాలంటే మన దైనందిన జీవితంలో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి. అయితే చెడు కొలెస్ట్రాల్ను ఎలా నియంత్రించాలో చాలా మందికి అవగాహన ఉండదు. అయితే తక్కువ ధరకు లభించే జామతో ఈ సమస్యను తేలిగ్గా తరిమికొట్టొచ్చు.క్రమం తప్పకుండా మందులు తీసుకోవడంతో పాటు రోజుకో జామ పండు తినాలని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తున్నారు.
జామ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ పండు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గిస్తుంది. అందుకే పోషకాహార నిపుణులు ఈ పండ్లను తినాలని సిఫార్సు చేస్తున్నారు. జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన అదనపు చెడు కొలెస్ట్రాల్ను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఇది మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతుంది. ప్రతిరోజూ ఒక జామ పండు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జామ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్త నాళాలు మూసుకుపోకుండా నిరోధించవచ్చు. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది ట్రైగ్లిజరైడ్లను కూడా నియంత్రిస్తుంది. అంటే ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయి తగ్గుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు జామ పండ్లు తినవచ్చు. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది అదనపు కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. జామ పండ్లలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. అంతే కాదు ఈ పండ్లలోని విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.