
ఆంధ్ర మాత.. అదే మన అచ్చ తెలుగు గోంగూర లేదా పుంటికూర.. ఎలా పిలుచుకున్న ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శాఖాహార పదార్థాలలో గోంగూర ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఆకుకూర అద్భుతమైన పోషక విలువలను కలిగి ఉంది. దీనిని కూరగా పచ్చడిగా.. అలానే ఎన్నో రకాలుగా వండుకుని తింటారు. గోంగూరను నోరూరించే ఆహార పదార్థంగానే కాకుండా, అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఒక సంజీవనిగా ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు.
గోంగూర ఒకే ఆకుకూరలో అన్ని రకాల పోషకాంశాలను కలిగి ఉన్న అరుదైనది. ఇది విటమిన్లు, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఈ సూక్ష్మపోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని అందించి, వివిధ శారీరక విధులను సక్రమంగా నిర్వహించడానికి తోడ్పడతాయి.
ఆయుర్వేదం ప్రకారం, గోంగూర త్రిదోషఘ్నంగా పనిచేస్తుంది. అంటే వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేసి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జఠరాగ్ని దీప్తిని కలిగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణాశయ సంబంధ వ్యాధులను నియంత్రించి, జీర్ణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గోంగూరలో తెల్ల, ఎర్ర రకాలు ఉన్నప్పటికీ, రెండూ సమానమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
గోంగూర జిగటగా, జిగురు జిగురుగా ఉంటుందని మనం గమనిస్తాం. ఈ జిగురు స్వభావం ఎముకల ఆరోగ్యానికి, కీళ్లలోని సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తికి, లూబ్రికేషన్కు అత్యంత ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఎముకలకు పుష్టినిచ్చి, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది వీర్యవృద్ధిని కలిగించి, శారీరక శక్తిని పెంపొందిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి గోంగూర గొప్ప ఉపశమనం అందిస్తుంది. ఇది కళ్లకు హితాన్ని కలిగించి, హృదయానికి టానిక్గా కూడా పనిచేస్తుంది.
గోంగూరను వండేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఇది సహజంగా పుల్లని రుచిని కలిగి ఉంటుంది కాబట్టి, ఇతర పులుపు పదార్థాలైన మామిడికాయ, నిమ్మకాయ, చింతపండు వంటివాటిని గోంగూరతో కలిపి వండకూడదు. ఇలా చేయడం వల్ల కఫం వృద్ధి చెందే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోంగూరను విడిగా వండటం వల్ల దానిలోని పోషకాంశాలు సంపూర్ణంగా శరీరానికి అందుతాయని, ఎక్కువ వేపుళ్లు చేసి, మాడగొట్టకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..