
వంట కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎండాకాలంలో బెస్ట్ ఫుడ్.. జస్ట్ 5 నిమిషాల్లోనే ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు.. పచ్చి పులుసు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో తయారుచేసినప్పటికీ, తెలంగాణలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక్కో ఇంట్లో ఒక్కో విధానంలో చేసినా, దీని రుచి మాత్రం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి చలువ చేస్తుంది.. అలాంటి రెసిపీని కొన్ని పద్దతులతో చేసుకుంటే అద్భుతం.. అమోఘం.. రుచికరమైన, సాంప్రదాయ తెలంగాణ స్టైల్ పచ్చి పులుసును కేవలం ఐదు నిమిషాల్లో ఎలా తయారుచేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
ముందుగా, పచ్చి పులుసుకు ముఖ్యమైన ఫ్లేవర్ ఇవ్వడానికి బాగా కారంగా ఉన్న ఒక పచ్చిమిర్చిని పొయ్యిపై కాల్చాలి. పచ్చిమిర్చిలో కారం తక్కువగా ఉంటే రెండు మిరపకాయలను కాల్చవచ్చు. ఇది పులుసుకు ఒక ప్రత్యేకమైన స్మోకీ రుచిని ఇస్తుంది. కాల్చిన తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత, ఒక విశాలమైన గిన్నెలో కాల్చిన పచ్చిమిర్చిని తీసుకోవాలి. దానితో పాటు కాడలతో సహా కొత్తిమీర, పావు కప్పు కచ్చాపచ్చాగా తరుక్కున్న ఉల్లిపాయ తరుగు, ఒక రెబ్బ కరివేపాకు, సరిపడా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని చేతులతో బాగా పిండాలి. ఇలా పిండడం వల్ల ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలోని సారం బయటకు వచ్చి ఫ్లేవర్స్ చింతపండు పులుసులోకి చక్కగా దిగుతాయి. ఈ దశ పచ్చి పులుసు రుచికి చాలా కీలకం.
పిండిన మిశ్రమంలో రెండు కప్పుల చింతపండు పులుసు పోయాలి. సుమారు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నుంచి తీసిన పులుసు రెండు కప్పులు (అర లీటరు) సరిపోతుంది. చింతపండు పులుసు పోసిన తర్వాత ఉల్లిపాయలు, ఇతర పదార్థాలను పులుసుతో కలిపి మరోసారి కలపాలి.
చివరగా, పచ్చి పులుసు రుచిని పెంచడానికి తాలింపు సిద్ధం చేయాలి. ఒక టేబుల్ స్పూన్ నూనెను వేడిచేసి, అందులో పావు చెంచా ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత అర టీస్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేయాలి. ముఖ్యంగా, ఒక టీ స్పూన్ ఎండుమిర్చి గింజలు వేయడం వల్ల పచ్చి పులుసుకు అద్భుతమైన రుచి వస్తుంది. ఈ పదార్థాలను బాగా వేయించాలి. కొందరు ఈ తాలింపులో వెల్లుల్లిపాయలను కూడా వేస్తారు; రుచి నచ్చితే మీరు కూడా ప్రయత్నించవచ్చు.
వేడి వేడి తాలింపును సిద్ధం చేసుకున్న పచ్చి పులుసులో పోసి, వెంటనే గిన్నెపై మూత పెట్టాలి. 30 సెకన్ల పాటు అలా వదిలేయడం వల్ల తాలింపు ఫ్లేవర్ పులుసుకు చక్కగా పడుతుంది. సర్వ్ చేసే ముందు పచ్చి పులుసులోని ఉప్పు, పులుపు రుచిని సరిచూసుకోవాలి. ఈ రెండింటిని సమతుల్యం చేయడంలోనే అసలైన రుచి దాగి ఉంది. తెలంగాణ శైలి పచ్చి పులుసులో బెల్లం అస్సలు వాడరు. ముద్దపప్పుతో లేదా నాన్-వెజ్ ఫ్రై కర్రీలతో పచ్చి పులుసు చాలా రుచికరంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..