
రోజును ఆరోగ్యంగా ప్రారంభించడానికి సరైన అల్పాహారం లేదా పానీయం ఎంతో ముఖ్యం.. చాలా మంది ఉదయం లేవగానే టీ లేదా కాఫీతో రోజును మొదలుపెడతారు. అయితే, దానికి బదులుగా సంప్రదాయబద్ధమైన, పోషకమైన రాగి జావను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాస్తవానికి రాగులు (ఫింగర్ మిల్లెట్స్) పోషకాల ఖజానం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ తోపాటుగా అధిక నాణ్యత గల ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఎముకలను దృఢంగా మార్చడంలో, బరువు తగ్గడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఈ రాగి జావ కేవలం రుచికరమైనదే కాదు, దీన్ని తయారుచేయడం కూడా చాలా సులభం, తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకోవచ్చు.
రాగి జావ ఉదయం పూట తీసుకోవడానికి అనేక ప్రయోజనాలున్నాయి. ఇది తేలికగా జీర్ణమవుతుంది, శక్తిని అందిస్తుంది.. శరీరానికి అవసరమైన పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. టీ, కాఫీల్లో ఉండే కెఫీన్ బదులుగా, రాగి జావ సహజమైన పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడని వారికి కూడా ఈ జావను ఇవ్వవచ్చు. పాలు వేసినా కూడా ఎలాంటి పాల వాసన రాకుండా చాలా రుచికరంగా ఉంటుంది.
జల్లించిన రాగి పిండి: 1 కప్పు
నీళ్లు: 2 కప్పులు (మరిగించడానికి) + 1/2 కప్పు (రాగి పిండి కలపడానికి)
పాలు: 1 కప్పు (నీళ్లకు బదులుగా మొత్తం పాలు లేదా మీకు ఇష్టమైన నిష్పత్తిలో వాడుకోవచ్చు)
చక్కెర: రుచికి సరిపడా (పావు కప్పు వరకు)
రాగి పిండి మిశ్రమం సిద్ధం చేయడం: ముందుగా, ఒక బౌల్ తీసుకుని అందులో అర కప్పు నీళ్లు పోయాలి. ఆ తర్వాత, ఒక కప్పు జల్లించిన రాగి పిండిని వేసి, ఉండలు లేకుండా ఒక స్పూన్తో స్మూత్గా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది రాగి జావలో ఉండలు కట్టకుండా చేస్తుంది.
పాలు, నీళ్లు మరిగించడం: మరొక బౌల్ను గ్యాస్ పైన పెట్టి, అందులో రెండు కప్పుల నీళ్లు, ఒక కప్పు పాలు పోయాలి. మీకు పాలు ఎక్కువ ఇష్టమైతే, నీళ్లకు బదులుగా మొత్తం పాలు మాత్రమే వాడుకోవచ్చు లేదా రెండు కప్పుల పాలు, ఒక కప్పు నీళ్లు వేసుకుని కూడా తయారుచేసుకోవచ్చు.
చక్కెర కలుపుట: పాలు మరిగేటప్పుడు, రుచికి సరిపడా చక్కెరను వేసుకోవాలి. సాధారణంగా పావు కప్పు వరకు చక్కెర సరిపోతుంది. చక్కెర కరిగి పాలు బాగా మరిగే వరకు వేడి చేయాలి.
రాగి మిశ్రమం కలుపుట: పాలు మరిగాక, ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని మరోసారి బాగా కలుపుకుని, ఉండలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకున్న తర్వాత, ఆ రాగి మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో నెమ్మదిగా పోస్తూ, వెంటనే గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపకపోతే పిండి ఉండలు కట్టే అవకాశం ఉంది.
ఉడికించడం: రాగి జావను సుమారు ఐదు నుండి పది నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. పిండి బాగా ఉడికి, జావ చిక్కబడుతుంది. ఇలా థిక్ క్వాంటిటీలోకి వచ్చాక స్టవ్ ఆపివేయవచ్చు.
ఈ రాగి జావను వేడివేడిగా తాగినా లేదా చల్లార్చి తాగినా చాలా రుచికరంగా ఉంటుంది.
చిన్నపిల్లలు పాలు ఇష్టపడని వారు కేవలం నీళ్లతో కూడా ఈ జావను తయారుచేసి ఇవ్వవచ్చు.
ఈ రాగి జావను తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టదు, సుమారు పది నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు.
ప్రతిరోజు ఉదయం బ్రష్ చేసిన వెంటనే టీ, కాఫీలకు బదులుగా ఈ రాగి జావను తాగండి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.. రోజును ఉత్సాహంగా ప్రారంభించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. అయితే.. రాగి జావ ముందుగా తాగి.. ఆ తర్వాత టిఫిన్ చేయొచ్చంటున్నారు. ఇంకా రోజులో ఎప్పుడైనా రాగి జావను తాగొచ్చు..
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..