
ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి నేటి కాలంలో అత్యవసరం. అలాంటి ఆహారంలో ఒక అద్భుతమైన ఎంపిక జొన్న గుగ్గిళ్లు. ఈ సంప్రదాయ రెసిపీ, కేవలం రుచిగా ఉండడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడే వారికి ఒక మంచి అల్పాహారం. అలాగే, పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టపడతారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక హెల్తీ స్నాక్గా కూడా దీన్ని అందించవచ్చు. జొన్న గుగ్గిళ్ల తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం ..
జొన్నలు: 1 కప్పు (ముగ్గురికి సరిపోతుంది), పల్లీలు: 1/4 కప్పు (ఆప్షనల్, కానీ రుచిని పెంచుతుంది), నీళ్లు: నానబెట్టడానికి, ఉడికించడానికి సరిపడా.. నెయ్యి/నూనె: 1 టేబుల్ స్పూన్, ఆవాలు: 1/2 టీస్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, పచ్చిశనగపప్పు: 1 టేబుల్ స్పూన్, మినపగుళ్లు: 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి: 2 (తుంపినవి), పచ్చిమిర్చి: 2-3 (సన్నగా తరిగినవి), ఉల్లిపాయ: 1 పెద్దది (పొడవుగా కట్ చేసినవి), వెల్లుల్లి రెబ్బలు: 5-6 (కచ్చాపచ్చాగా దంచుకున్నవి), కరివేపాకు: కొద్దిగా, పసుపు: 1/4 టీస్పూన్, ఇంగువ: 1/4 టీస్పూన్ (రుచికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది), ఉప్పు: రుచికి సరిపడా (బరువు తగ్గేవారు తక్కువ వాడటం మంచిది), పచ్చి కొబ్బరి తురుము: కొద్దిగా (ఆప్షనల్, క్యారెట్ తురుము కూడా వాడవచ్చు), కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినవి), నిమ్మరసం: 1 నిమ్మకాయది (ఆప్షనల్)
1. జొన్నలను నానబెట్టడం: ముందుగా ఒక కప్పు జొన్నలను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. తరువాత రెండు కప్పుల నీళ్లు పోసి ఎనిమిది నుండి పది గంటల పాటు నానబెట్టాలి. ఉదయం అల్పాహారం కోసం రాత్రి నానబెట్టుకోవడం ఉత్తమం.
2. ఉడికించడం: నానిన జొన్నల నుండి నీటిని వంపేసి, మళ్ళీ ఒకసారి కడిగి కుక్కర్లో వేయాలి. దీనికి పావు కప్పు పల్లీలు, ఒక కప్పు నీళ్లు కలిపి మూత పెట్టి, మీడియం ఫ్లేమ్లో ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. జొన్నలు మెత్తగా ఉడికాయో లేదో చూసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు చేర్చి మరో రెండు విజిల్స్ రానివ్వవచ్చు.
3. నీరు వడకట్టడం: ఉడికిన జొన్నలను ఒక జాలిగిన్నెలో వేసి అదనపు నీటిని తీసివేయాలి. ఈ నీటిని పప్పు లేదా అన్నంలో వాడుకోవచ్చు.
4.పోపు తయారీ: స్టవ్ పైన ఒక పాన్ పెట్టి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్లు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగాక తుంపిన ఎండుమిర్చి, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొంచెం రంగు మారే వరకు వేయించాలి.
5. మసాలా దినుసులు కలపడం: వేగిన పోపులో పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ వేసి బాగా కలపాలి. ఇంగువ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
6. జొన్నలు కలపడం: ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న జొన్నలు, పల్లీలను వేసి రుచికి సరిపడా ఉప్పు కలపాలి. అన్నీ బాగా కలిసేలాగా కలిపి, మూత పెట్టి తక్కువ మంటపై రెండు నిమిషాల పాటు ఉడికించాలి. జొన్నలకు ఫ్లేవర్స్ పట్టడానికి ఇది సహాయపడుతుంది. ఎక్కువ ఉడికిస్తే జొన్నలు గట్టిపడతాయి.
7. చివరి మెరుగులు: స్టవ్ ఆపివేసి, చివరగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మరసం పిండి బాగా కలపాలి. కొబ్బరి తురుము, నిమ్మరసం ఆప్షనల్. ఈ విధంగా తయారు చేసుకున్న జొన్న గుగ్గిళ్లు చాలా రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. వారంలో కనీసం ఒక్కసారైనా వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రాత్రి నానబెట్టుకుంటే ఉదయం అల్పాహారం తయారు చేయడం సులువు అవుతుంది.