14 రోజులు.. 5 ఆకులు.. మీ శరీరంలో అద్భుతాలు చేసే మ్యాజిక్.. ఎన్నో సమస్యలకు చెక్..

రుచి కోసం వాడి, తిన్న తర్వాత తీసి పక్కన పడేసే కరివేపాకు.. కేవలం ఒక పోపు దినుసు మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన నేచురల్ హెల్త్ టానిక్ అని మీకు తెలుసా? కేవలం 14 రోజుల పాటు క్రమం తప్పకుండా కరివేపాకును మీ జీవనశైలిలో భాగం చేసుకుంటే, మీ జీర్ణక్రియ నుండి జుట్టు ఆరోగ్యం వరకు శరీరంలో జరిగే విప్లవాత్మక మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

14 రోజులు.. 5 ఆకులు.. మీ శరీరంలో అద్భుతాలు చేసే మ్యాజిక్.. ఎన్నో సమస్యలకు చెక్..
Curry Leaves Benefits

Updated on: Feb 08, 2026 | 5:03 PM

మనం ప్రతిరోజూ వంటల్లో రుచి కోసం, సువాసన కోసం కరివేపాకును వాడుతుంటాం. చాలామంది తింటున్నప్పుడు దాన్ని తీసి పక్కన పడేస్తారు. కానీ కరివేపాకు కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు.. అది ఒక అద్భుతమైన నేచురల్ హెల్త్ టానిక్ అని ప్రముఖ యోగా గురువు డాక్టర్ హంస యోగేంద్ర వివరిస్తున్నారు. కేవలం 14 రోజుల పాటు క్రమం తప్పకుండా కరివేపాకును తీసుకుంటే శరీరంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆమె స్పష్టం చేశారు.

కరివేపాకులో ఏముంది?

ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో.. విటమిన్లు A, B, C, E లతో పాటు ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది డయాబెటిస్ నిరోధక, గుండె రక్షణ లక్షణాలను కలిగి ఉంటుంది.

14 రోజుల ప్రయాణం – శరీరంలో కలిగే మార్పులు

జీర్ణ వ్యవస్థకు పునరుజ్జీవం

కరివేపాకు జీర్ణ ఎంజైమ్‌లను యాక్టివ్ చేస్తుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు 14 రోజుల్లో క్రమంగా తగ్గుముఖం పడతాయి.

యవ్వనాన్ని కాపాడుతుంది

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. ఇది కణాల క్షీణతను అడ్డుకుని, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది.

జుట్టు – చర్మ సౌందర్యం

కరివేపాకులో ఉండే బీటా-కెరోటిన్, ప్రోటీన్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గడమే కాకుండా, చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

షుగర్ కొలెస్ట్రాల్ నియంత్రణ

కరివేపాకు ఇన్సులిన్ కార్యకలాపాలను మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఎలా తీసుకోవాలి?

డాక్టర్ హంసాజీ సూచనల ప్రకారం.. ఉదయాన్నే 4-5 తాజా కరివేపాకులను నమిలి గోరువెచ్చని నీరు తాగాలి. మజ్జిగలో కరివేపాకు కలిపి తీసుకోవడం వల్ల చలవ చేస్తుంది. ఆహారంలో కరివేపాకు పొడి లేదా చట్నీ రూపంలో చేర్చుకోవచ్చు.