
చికెన్ ప్రియులకు ఎంతో ఇష్టమైన వంటల్లో చికెన్ కీమా పరాఠా కూడా ఒకటి. దీన్ని ఇంట్లోనే చేసుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. అయినా పరాఠాలు మృదువుగా, లోపల పెట్టిన స్టఫింగ్ బయటకు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే పిండిని కలుపుకునే విధానం , కీమా కూరను వండుకునే పద్ధతి చాలా ముఖ్యం. ఇందులో వాడే వాము జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా పరాఠాకు మంచి సువాసనను ఇస్తుంది.
కావలసిన పదార్థాలు
గోధుమపిండి: 2 కప్పులు
వాము: 1/2 టీస్పూన్
వంట నూనె లేదా నెయ్యి: తయారీకి తగినంత
ఉల్లిపాయ తరుగు: 1 పెద్దది (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి: 2
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
టమాటో గుజ్జు: 2 మధ్యస్థ పరిమాణంలో ఉన్నవి
మసాలాలు: పసుపు (అర టీస్పూన్), కారం పొడి (1 చెంచా), జీలకర్ర పొడి (1 టీస్పూన్), గరం మసాలా (1 టీస్పూన్), చాట్ మసాలా (పావు టీస్పూన్)
చికెన్ కీమా: 300 గ్రాములు (బాగా శుభ్రం చేసినది)
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర తరుగు: కొద్దిగా
పరాఠా పిండిని కలిపే విధానం
పరాటాలు మృదువుగా , రుచికరంగా రావాలంటే ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో 2 కప్పుల గోధుమపిండిని తీసుకోవాలి. అందులో 1/2 టీస్పూన్ వాము, 1/2 టీస్పూన్ ఉప్పు వేసి చేతులతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీస్పూన్ల నూనె వేసి పిండికి పట్టించాలి, ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండి ముద్ద చపాతీ పిండి కంటే కాస్త మెత్తబడే వరకు 3 నుండి 4 నిమిషాల పాటు బాగా పిసకాలి. చివరగా ఈ పిండి ముద్దపై ఒక తడి కాటన్ గుడ్డను కప్పి సుమారు 30 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. దీనివల్ల పిండి బాగా నాని, పరాటాలు లట్టించేటప్పుడు విరిగిపోకుండా ఎంతో సాఫ్ట్గా వస్తాయి.
చికెన్ కీమా స్టఫింగ్ తయారీ విధానం
పరాఠా లోపల పెట్టే కూర ఎంత రుచిగా ఉంటే, పరాఠా అంత అద్భుతంగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బాణలిలో 3 టీస్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి , అల్లం ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు దోరగా వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం-వెల్లుల్లి పేస్ట్తో పాటు, ముందుగా సిద్ధం చేసుకున్న రెండు టమాటోల గుజ్జును కూడా ఇందులో వేసి, వాటిలోని పచ్చి వాసన , తేమ అంతా పూర్తిగా ఆవిరైపోయే వరకు బాగా ఉడికించాలి.
ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా , కొద్దిగా చాట్ మసాలా వేసి, మసాలాలన్నీ నూనెలో బాగా కలిసే వరకు వేపాలి. ఈ మసాలా గ్రేవీలో 300 గ్రాముల బాగా శుభ్రం చేసిన చికెన్ కీమాను వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిపై మూత పెట్టి, మధ్యస్థ మంట మీద (Medium Flame) సుమారు 10 నిమిషాల పాటు చికెన్ను ఉడికించాలి. చికెన్ కీమాలోని రసాలు ఊరి, కూర దగ్గరగా పడి బాగా ఉడికిన తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులను చల్లి స్టవ్ ఆపివేయాలి. ఈ చికెన్ కీమా మిశ్రమాన్ని పరాఠాలో పెట్టడానికి ముందు పూర్తిగా చల్లారనివ్వడం అత్యంత కీలకం.
స్టఫింగ్తో పరాఠా కాల్చే విధానం
ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని సమాన భాగాలుగా విభజించి చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలు చేయాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లుతూ చిన్న పూరీ సైజులో ఒత్తాలి. దీని మధ్యలో 2 టేబుల్ స్పూన్ల చల్లారిన చికెన్ కీమా మిశ్రమాన్ని పెట్టాలి. ఆ తర్వాత అంచులన్నింటినీ పైకి తెచ్చి, మోదకం లాగా ఒకచోట కలిపి గట్టిగా మూసివేసి మళ్ళీ గుండ్రటి ఉండలా చుట్టాలి. ఈ కూరతో నింపిన ఉండపై కొద్దిగా పొడి పిండి చల్లి, లోపల ఉన్న కీమా బయటకు రాకుండా చపాతీ కర్రతో చాలా మెల్లగా, సమానంగా ఒత్తుకుంటూ పరాఠాలా తయారు చేయాలి.
ఇప్పుడు పొయ్యి మీద పెనం వేసి బాగా వేడి చేసి, దానిపై సిద్ధం చేసుకున్న పరాఠాను వేయాలి. ప్రతి వైపు ఒక నిమిషం పాటు నూనె లేకుండా కాల్చిన ఆ తర్వాత, పైన కొద్దిగా నెయ్యి లేదా వెన్న పూసి, పరాఠా రెండు వైపులా మంచి బంగారు రంగు (Golden Brown) మచ్చలు వచ్చే వరకు మధ్యస్థ మంటపై బాగా కాల్చాలి. ఎంతో రుచికరమైన, వేడి వేడి చికెన్ కీమా పరాఠా ఇప్పుడు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంది. దీనిని తాజా గట్టి పెరుగు, పుదీనా చట్నీ లేదా మీకు ఇష్టమైన టమాటో సాస్తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.