
సాధారణంగా ఇంట్లో అరటిపండ్లు తెచ్చిన కొన్ని రోజులకే వాటి తొక్కపై నల్లటి మచ్చలు రావడం ప్రారంభిస్తాయి. పండ్లు ఎక్కువగా పండిపోవడంతో చాలామంది అవి పాడైపోయాయని అనుకుని డస్ట్బిన్లో పారేస్తుంటారు. కానీ, నిజానికి నల్లటి మచ్చలు ఉన్న అరటిపండ్లు మరింత రుచిగా, తీపిగా ఉండటమే కాకుండా వాటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పెరుగుతాయి. ఇటువంటి పండ్లను వంటగదిలో పారేయకుండా ఎలా రీయూజ్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.
బాగా పండిన అరటిపండ్లు కేకులు, బ్రెడ్ తయారీకి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి పిండికి సహజ సిద్ధమైన తేమను, తీపిని అందిస్తాయి. వీటిని బాగా గుజ్జుగా చేసి కేక్ బ్యాటర్లో కలపడం వల్ల మైదా లేదా గోధుమ పిండితో చేసే బ్రెడ్లు మెత్తగా, రుచిగా వస్తాయి.
నల్లటి మచ్చల అరటిపండ్లలో సహజమైన తీపి ఎక్కువ కాబట్టి, స్మూతీలు చేసేటప్పుడు విడిగా పంచదార వేయాల్సిన అవసరం ఉండదు. పాలు, పెరుగు, బాదం, కొద్దిగా దాల్చినచెక్క పొడితో కలిపి బ్లెండ్ చేస్తే రుచికరమైన, ఆరోగ్యకరమైన బనానా స్మూతీ సిద్ధమవుతుంది.
ఉదయం టిఫిన్ కోసం అరటిపండు పాన్కేక్లు సరైన ఎంపిక. మెత్తటి అరటిపండు గుజ్జులో కొద్దిగా ఓట్స్, గుడ్డు, చిటికెడు వంటసోడా కలిపి పెనంపై చిన్న చిన్న పాన్కేక్లుగా వేసుకోవచ్చు. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.
పండిన అరటిపండు ముక్కలను కోసి ఫ్రీజర్లో కొన్ని గంటలు ఉంచాలి. బాగా గడ్డకట్టిన తర్వాత వాటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తే క్రీమీగా ఉండే నాచురల్ ఐస్క్రీమ్ తయారవుతుంది. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు లేదా షుగర్ కలపాల్సిన పనిలేదు.
మీరు చేసే ఓట్మీల్, పాయసం, హల్వా లేదా బేకింగ్ ఐటమ్స్లో పంచదారకు బదులుగా ఈ అరటిపండు గుజ్జును వాడవచ్చు. ఇది కేలరీలను తగ్గించడమే కాకుండా వంటకానికి మంచి అరోమాను ఇస్తుంది.
ఇకపై ఇంట్లో అరటిపండ్లపై నల్లటి మచ్చలు పడితే పొరపాటున కూడా పారేయకండి. ఈ సింపుల్ వంటగది చిట్కాలతో రుచికరమైన పదార్థాలను తయారు చేసి ఇంట్లో అందరికీ వడ్డించండి.