
వేసవి తీవ్రత కేవలం పగటిపూట వేడికి మాత్రమే పరిమితం కాదు. ఈ మధ్య కాలంలో రాత్రిపూట కూడా వేడి, ఉష్ణోగ్రతలు గరిష్టంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం ఆరోగ్యంపై అధికంగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రాత్రి సురక్షితమని భావించేవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పగటిపూట వేడి తగ్గిన తర్వాత కూడా రాత్రిపూట ఉష్ణోగ్రత తగ్గకపోతే శరీరం చల్లబడటానికి అవకాశం ఉండదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం కష్టమవుతుంది. పెరిగిన వేడి కారణంగా చెమట సరిగ్గా ఆరదు దీంతో శరీరం చల్లబడదు. ఇది వడదెబ్బ తగిలే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉందో, దీనిని నివారించడానికి ఏమి చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..
పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారు తమ శరీర ఉష్ణోగ్రతను సరిగ్గా నియంత్రించుకోలేరు. అంతేకాకుండా ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి కూడా అధిక ప్రమాదం ఉంటుంది. మూసి ఉన్న లేదా గాలి, వెలుతురు సరిగా ప్రసరించని గదులలో నివసించే వ్యక్తులు కూడా అధిక ప్రమాదం ఉంటుంది.
రాత్రిపూట గదిలో ఏసీ, వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం ముఖ్యం. పడుకునే ముందు, పడుకున్న తర్వాత మధ్యలో నీళ్లు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. తేలికైన, వదులుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. అవసరమైతే ఫ్యాన్ లేదా కూలర్ను ఉపయోగించడం మంచిది. వడదెబ్బ ప్రమాదం పగలే కాకుండా రాత్రిపూట కూడా ఉంటుంది. అందువల్ల మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.