
ఈ మధ్యకాలంలో సందర్భం ఏదైనా మందు ఉండాల్సిందే అనే స్థాయికి జనాలు వచ్చేశారు. ఆనంద క్షణాల్లో చిల్గా మొదలుపెట్టే ఈ తాగడం.. చివరకు ప్రాణాల మీదకు తెస్తుంది. అయితే ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో మద్యం తాగడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ హెల్త్ వెబ్సైట్ హెల్త్లైన్ ప్రకారం.. మానవ కాలేయం గంటకు కేవలం ఒక స్టాండర్డ్ డ్రింక్ మాత్రమే ప్రాసెస్ చేయగలదు. అంతకంటే వేగంగా తాగితే, రక్తంలో ఆల్కహాల్ శాతం వేగంగా పెరిగిపోతుంది. BAC 0.08 శాతం ఉంటే వ్యక్తి మత్తులో ఉన్నట్లు లెక్క. అది 0.40 శాతానికి చేరుకుంటే అత్యంత ప్రమాదకరం. ఈ స్థాయికి చేరుకుంటే వ్యక్తి కోమాలోకి వెళ్లడం లేదా మరణించడం సంభవిస్తుంది.
ఒక స్టాండర్డ్ డ్రింక్లో సుమారు 14 గ్రాముల స్వచ్ఛమైన ఆల్కహాల్ ఉంటుంది. ఇది బీర్కి సమానం. అంతేకాకుండా 5 ఔన్సుల వైన్, 1.5 ఔన్సుల హార్డ్ లిక్కర్కు కూడా సమానం. సాధారణంగా ఒక్క స్టాండర్డ్ డ్రింక్ రక్తంలో ఆల్కహాల్ను 0.02 శాతం పెంచుతుంది.
ఒక వ్యక్తి 0.40 శాతం BACకి చేరుకోవడానికి సుమారు 25 స్టాండర్డ్ డ్రింక్స్ పట్టవచ్చు. అయితే ఇది వ్యక్తి శారీరక బరువు, వయస్సు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. బీరు గ్లాసుల పరిమాణం పెరిగినా లేదా అధిక ఆల్కహాల్ శాతం ఉన్న బ్రాండ్లు తాగినా ఈ ప్రమాదం త్వరగా పొంచి ఉంటుంది.
చఆహారం లేకుండా తాగితే ఆల్కహాల్ నేరుగా రక్తప్రవాహంలోకి చేరి తక్కువ మొత్తంలోనే ఎక్కువ మత్తును ఇస్తుంది. మద్యం మధ్యలో నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ పెరిగి ప్రాణవాయువు తగ్గుతుంది. మద్యం తాగేటప్పుడు పౌష్టికాహారం తీసుకోవడం, ప్రతి పెగ్గుకు మధ్య నీరు త్రాగడం వంటి చేయాలి. వీలైనంత వరకు మద్యం ముట్టుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిది.