
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పాలలో కల్తీ సమస్య రోజురోజుకీ పెరుగుతోంది. స్వచ్ఛమైన పాల పేరుతో నీరు, డిటర్జెంట్, పిండిపదార్థాలు వంటి హానికర పదార్థాలను కలిపి విక్రయిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి కల్తీ పాలను తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇంట్లోనే కొన్ని సులభమైన పరీక్షల ద్వారా పాల స్వచ్ఛతను గుర్తించవచ్చని చెబుతున్నారు.
పాలలో ఎక్కువగా కలిపే పదార్థం నీరు. దీన్ని గుర్తించడానికి మెరిసే నునుపైన ఉపరితలంపై ఒక చుక్క పాలు వేయాలి. ఆ చుక్క నెమ్మదిగా దొర్లుతూ తెల్లటి గీతను వదిలితే పాలు స్వచ్ఛమైనవిగా భావించవచ్చు. ఒకవేళ చుక్క వేగంగా జారిపోతూ ఎలాంటి గుర్తు వదలకపోతే అందులో నీరు కలిపినట్లు అర్థం.
కొంతమంది వ్యాపారులు పాలకు ఎక్కువ నురుగు రావడానికి, చిక్కదనం పెంచడానికి డిటర్జెంట్ కలుపుతుంటారు. దీన్ని తెలుసుకోవడానికి ఒక గాజు పాత్రలో 5 నుంచి 10 మిల్లీలీటర్ల పాలు తీసుకుని, అంతే పరిమాణంలో నీరు కలపాలి. ఆ తర్వాత బాగా షేక్ చేయాలి.
స్వచ్ఛమైన పాలలో కొద్దిగా నురుగు వచ్చి త్వరగా తగ్గిపోతుంది. కానీ డిటర్జెంట్ కలిపిన పాలలో సబ్బులాంటి చిక్కటి నురుగు ఏర్పడి ఎక్కువసేపు అలాగే ఉంటుంది. అలాంటి పాలను తాగడం ఆరోగ్యానికి హానికరం.
పాలను చిక్కగా కనిపించేలా చేయడానికి పిండిపదార్థాలు కలుపుతుంటారు. దీన్ని గుర్తించడానికి రెండు టేబుల్ స్పూన్ల పాలలో కొద్దిగా అయోడిన్ ద్రావణం కలపాలి. పాలు నీలి రంగులోకి మారితే అందులో పిండిపదార్థం కలిపినట్లు అర్థం.
స్వచ్ఛమైన పాలకు సహజమైన తీపి రుచి ఉంటుంది. కానీ కృత్రిమ పాలు కొద్దిగా చేదు రుచిని ఇస్తాయి. అలాగే వేళ్ల మధ్య పాలను రుద్దితే సబ్బులా జారుతున్నట్లు అనిపిస్తే అది కల్తీ పాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
స్వచ్ఛమైన పాలు వేడి చేసినా లేదా ఫ్రిజ్లో ఉంచినా పసుపు రంగులోకి మారవు. ఒకవేళ పాలు పసుపు రంగులోకి మారితే వాటిలో కల్తీ పదార్థాలు ఉండే అవకాశం ఉంది. అలాంటి పాలను తీసుకోకుండా ఉండటం మంచిది.
కల్తీ పాలు తాగడం వల్ల జీర్ణ సమస్యలు, అలర్జీలు, కిడ్నీ సమస్యలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి పాలను తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజూ ఉపయోగించే పాలను పరీక్షించి చూసుకోవడం ద్వారా మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.