వైఎస్ వివేకా హత్యపై స్పందించిన వైఎస్ జగన్

కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన అన్న కుమారుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. ఆయన మాటల్లోనే.. చిన్నాన మీద జరిగిన ఈ ఘటన అత్యంత దారుణమైన, రాజకీయంగా అత్యంత నీచమైన చర్య. ఒక మాజీ ఎంపీని, 30 ఏళ్లుగా రాజకీయ చరిత్ర కలిగిన, సౌమ్యుడిగా పేరు పొందిన వ్యక్తిని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి గొడ్డలితో నరికి చంపడమన్నది దారుణం. ఇంత తీవ్రంగా సంఘటన జరిగితే […]

వైఎస్ వివేకా హత్యపై స్పందించిన వైఎస్ జగన్

Updated on: Mar 15, 2019 | 7:15 PM

కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన అన్న కుమారుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పందించారు. ఆయన మాటల్లోనే..

చిన్నాన మీద జరిగిన ఈ ఘటన అత్యంత దారుణమైన, రాజకీయంగా అత్యంత నీచమైన చర్య. ఒక మాజీ ఎంపీని, 30 ఏళ్లుగా రాజకీయ చరిత్ర కలిగిన, సౌమ్యుడిగా పేరు పొందిన వ్యక్తిని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి గొడ్డలితో నరికి చంపడమన్నది దారుణం. ఇంత తీవ్రంగా సంఘటన జరిగితే దర్యాప్తు జరుగుతున్న తీరు చాలా బాధగా ఉంది.

ఒక లెటర్ చూపించారు, ఆయన చనిపోతూ ఆ లెటర్ రాశారని, అందులో ఒక డ్రైవర్ పేరు పెట్టారని పోలీసులు దాన్ని చూపించారు. పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి లెటర్ ఎలా రాస్తారు?

బెడ్‌రూంలో గొడ్డలితో నరకడం జరిగింది. తల మీదనే ఐదు సార్లు నరికారు. ఎక్కువ మంది ఈ హత్యలో పాల్గొన్నారు. మూర్చ వచ్చి పడిపోయి చనిపోయినట్టు చిత్రీకరించి చనిపోయనట్టు చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. రక్తపు మడుగులో ఉన్న చిన్నాన్న లెటర్ ఎలా రాయగలుగుతారు? పోలీసులు చూపిస్తున్న లెటర్ కల్పితం.

ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మాకు అస్సలు నమ్మకం లేదు. సీబీఐ విచారణ జరగాలి. డీఐజీ, ఎస్పీతో నేను మాట్లాడుతుండగానే.. నా కళ్ల ముందే వాళ్లకు రెండు మూడు సార్లు అడిషనల్ ఇంటెలిజన్స్ డీజీపీ దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి. అవి నాకు కనబడుతూనే ఉన్నాయి.

నిజాలు బయటకు రావాలి, హత్య చేసిన వాళ్లు ఎంతటి వారైనా శిక్షించబడాలి. మొదట మా తాతను చంపారు, తర్వాత మా నాన్నను చంపారు. నాన్న మరణానికి ముందు అసెంబ్లీలో చంద్రబాబు సవాల్ చేస్తూ అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని అన్నారు. తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో నాపై హత్యాయత్నం జరిగింది. ఈ మూడు అంశాల్లోనూ చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబుకు రిపోర్ట్ చేయని వ్యవస్థతోనే విచారణ జరగాలి. మేము సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాము.

ఈ సంఘటన ద్వారా రెచ్చిపోయి ఎలాంటి కార్యక్రమాలు దయచేసి చేయొద్దని వైసీపీ పార్టీ అభిమానులను జగన్ కోరారు.