టీఆర్‌ఎస్‌లో ఈటల రేపిన ముసలం… ఏ పరిణామాలకు సంకేతం?

| Edited By:

Sep 04, 2019 | 11:09 AM

ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి ఈటెలకు కేసీఆర్ కు మధ్య దూరం పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్ దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఆయన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. మంత్రివర్గం నుంచి ఈటలకు ఉద్వాసన పలకనున్నారనే వార్తల నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. రాజేంద్రనగర్‌లో పంచాయతీరాజ్ శాఖ భవనంలో మంగళవారం (సెప్టెంబర్ 3) ఆ […]

టీఆర్‌ఎస్‌లో ఈటల రేపిన ముసలం... ఏ పరిణామాలకు సంకేతం?
TRS and Etela
Follow us on

ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి ఈటెలకు కేసీఆర్ కు మధ్య దూరం పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన కీలక సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్ దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ ఆయన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. మంత్రివర్గం నుంచి ఈటలకు ఉద్వాసన పలకనున్నారనే వార్తల నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

రాజేంద్రనగర్‌లో పంచాయతీరాజ్ శాఖ భవనంలో మంగళవారం (సెప్టెంబర్ 3) ఆ శాఖకు సంబంధించిన క్షేత్ర స్థాయి అధికారులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే.. ఈ సమావేశానికి మంత్రి తలసాని, ఈటల మినహా తెలంగాణ మంత్రులంతా హాజరయ్యారు. మంత్రి తలసాని తిరుపతి వెళ్లడంతో ఈ సమావేశానికి రాలేకపోయారు. కానీ, హైదరాబాద్‌లోనే ఉన్న ఈటల ఈ సమావేశానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

సీఎం కేసీఆర్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారని.. మంత్రివర్గం నుంచి ఇద్దరు మంత్రులకు ఉద్వాసన తప్పదని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ మంత్రులు ఒకరు ఈటల రాజేందర్ అని ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఇటీవల తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో మాట్లాడుతూ ఈ వార్తలను ఖండించారు. ఈ క్రమంలో భావోద్వేగంగా మాట్లాడిన ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తాము గులాబీ జెండా ఓనర్లమని.. తనకు మంత్రి పదవి బిక్ష కాదని ఈటల రాజేందర్ అన్నారు. తనకు మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదన్నారు. తాను పార్టీలోకి మధ్యలో వచ్చినవాడిని కాదని.. బతికొచ్చినవాడిని కా దని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని.. ధర్మం, న్యాయం మాత్రమే శాశ్వతమని చెప్పారు. దొంగలెవరో, దొరలెవరో త్వరలోనే తేలుతుందన్నారు. గెలవగలిగే సత్తా ఉన్నోడిని, అమ్ముడు పోకుండా ఉన్నోడిని నేను నా భుజాల మీద పెట్టుకొని మోసే ప్రయత్నం చేస్తా. లేనిపోనివి చెబితే మాత్రం దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేశానని.. ఉద్యమంలో మూడున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగురవేశానని ఈటల చెప్పారు. తనను చంపాలనే ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా తెలంగాణ జెండా వదల్లేదని తెలిపారు. ఈటల వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ వర్గాల్లో కలకలం రేపాయి. ఆ తర్వాత వాటిపై ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే.. నాటి నుంచి ఆయన సీఎం కేసీఆర్‌ను కలవలేదని తెలుస్తోంది.

తాజాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్ రాకపోవడంతో మంత్రి పదవి నుంచి ఉద్వాసన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈటల రాజేందర్ మాత్రం తాను పర్యవేక్షిస్తున్న వైద్య శాఖకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈటలకు ఆహ్వానం అందిందా? లేదా? అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.