ఏం కొనేటట్టు లేవుగా..!

| Edited By: Srinu

May 14, 2019 | 7:00 PM

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్‌లో ధరలు మండుతోన్నాయి. ప్రధానంగా జిల్లాల్లో కూరగాయల దిగుబడులు తగ్గిపోవడంతో ధరలు ఆకాశానంటుతున్నాయి. భానుడి భగభగలకు తోడు నీటి కొరతతో కూరగాయల తోటలు ఎండిపోతున్నాయి. టామాటాలు మొదలుకొని వంకాయ, బెండకాయ, దొండకాయ, కేబేజీ, పచ్చిమిర్చి.. ఇలా ఒకటేమిటి అన్ని కాయగూరల ధరలు ఆకాశానికి ఎగబాకాతోన్నాయి. గత నెలలో కేజీ 25 నుంచి 30 రూపాయలు పలికే కూరగాయలు ఇప్పుడు 50 రూపాయలను క్రాస్ చేశాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి […]

ఏం కొనేటట్టు లేవుగా..!
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. మార్కెట్‌లో ధరలు మండుతోన్నాయి. ప్రధానంగా జిల్లాల్లో కూరగాయల దిగుబడులు తగ్గిపోవడంతో ధరలు ఆకాశానంటుతున్నాయి. భానుడి భగభగలకు తోడు నీటి కొరతతో కూరగాయల తోటలు ఎండిపోతున్నాయి. టామాటాలు మొదలుకొని వంకాయ, బెండకాయ, దొండకాయ, కేబేజీ, పచ్చిమిర్చి.. ఇలా ఒకటేమిటి అన్ని కాయగూరల ధరలు ఆకాశానికి ఎగబాకాతోన్నాయి. గత నెలలో కేజీ 25 నుంచి 30 రూపాయలు పలికే కూరగాయలు ఇప్పుడు 50 రూపాయలను క్రాస్ చేశాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి దిగుబడులు బాగా తగ్గాయంటున్నారు వ్యాపారులు.

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సిద్ధిపేటతో పాటు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు కూరగాయలు దిగుమతి అవుతాయి. వీటితో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర, నుంచి టమాటా, క్యాప్సికం, ఆలు, పచ్చిమిర్చి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు.

ఏపీలోని విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు నగరాల్లో మార్కెట్లకు కూడా కూరగాయల రాక తగ్గింది. రైతు బజార్లలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. వేసవి కారణంగా అందరూ శాఖాహారం ఎక్కువగా తీసుకోవడం.. దీనికి తోడు శుభకార్యాలు కావడంతో కూరగాయల వినియోగం పెరిగింది. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశానంటుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో టమాటా, కాకర, క్యారెట్ బీట్రూట్ కిలో రూ.50పైననే పలుకుతోంది. బీర, వంగ తదితర రకాలు కిలో రూ.40ని క్రాస్ చేశాయి. ఇక ఇంటి వద్దకు వచ్చే వ్యాపారులు చెప్పే రేట్లు వింటే వడదెబ్బ తగలక మానదు.

ఇక టమాటాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైబ్రిడ్ టమాటాలు కిలో 45 నుంచి 50 రూపాయలు పలుకుతున్నాయి. దేశ టమాటాలు 35 నుంచి 40 రూపాయలు పలుకుతున్నాయి. గత నెల ఏప్రిల్ తొలివారంలో కేవలం 15 నుంచి 20 రూపాయలున్న టమాటా ఇప్పుడు ఏకంగా 50ని క్రాస్ చేసింది. ఇలా ఉంటే తాము ఏం కొనాలి..? ఏం తినాలి ..? అంటూ మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు.