సిగ్గులేకుండా బీజేపీ ఛార్జిషీట్ అంటూ మాట్లాడుతోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల్ని ఎంతో అభివృద్ధి పథంలో నడుపుతున్నందుకా మామీద మీ ఛార్జిషీట్ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడాలేని విధంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నందుకా మీరు మామీద ఛార్జిషీట్ వేసేది అంటూ కేటీఆర్ బీజేపీ అధినేతలపై తన మీడియా ప్రెస్ మీట్ లో నిప్పులు చెరిగారు. ఆరేండ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి పథంలో నిలిపిందని కేటీఆర్ అన్నారు.
మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మతత్వాన్ని, ఏర్పాటు వాదాన్ని ప్రోత్సహించే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కేంద్ర మంత్రులంతా ప్రశంసించి.. ఎన్నికల వేళ ఛార్జీషీట్ అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జవడేకర్ రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు కేటీఆర్.