మహారాష్ట్రలో సోమవారం నుంచి మళ్ళీ గుడి గంటలు మోగనున్నాయి. ఆలయాలను, ప్రార్థనామందిరాలను మళ్ళీ తెరుస్తున్నారు. అయితే భక్తులు కచ్చితంగా కరోనావైరస్ గైడ్ లైన్స్ పాటించాలని ప్రభుత్వం హెచ్చరించింది. కోవిడ్ కారణంగా మహారాష్ట్రలోనూ, ఇతర రాష్ట్రాలలోను గత మార్చి నుంచి ఆలయాలను, ప్రార్థనా మందిరాలను మూసివేశారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వీటి మూసివేతపై బీజేపీ, బజరంగ్ దళ్, వీ హెచ్ పీ వంటి హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. వీటిని వెంటనే తెరవాలంటూ ఈ సంస్థల సభ్యులు, కార్యకర్తలు పలు చోట్ల నిరసన ప్రదర్శనలకుదిగారు. టెంపుల్స్ ని ఎప్పుడు రీఓపెన్ చేస్తారంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఏకంగా సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన లేఖ పెను దుమారం సృష్టించింది. హోమ్ మంత్రి అమిత్ షా సైతం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోష్యారీ .’హిందుత్వ’ అనే పదాన్ని వాడిఉండకుండా చూడాల్సిందన్నారు. చివరకు రాష్ట్రంలో కొంతవరకు కోవిడ్ తగ్గుముఖం పట్టినట్టు భావించడంతో ప్రభుత్వం ఈ నెల 16 నుంచి ఆలయాలను, ప్రార్థనా మందిరాలను మళ్ళీ ప్రారంభించాలని నిర్ణయించింది.