
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో అసిఫాబాద్ జిల్లాలో డీజీపీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆసిఫాబాద్ పర్యటనకు వెళ్లిన డీజీపీ మహేందర్ రెడ్డి… స్థానిక పోలీస్ అధికారులతో ఏఆర్ హెడ్క్వార్టర్ట్స్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐజీ నాగిరెడ్డి, అదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు వారియర్, ఏఎస్పీ సుధీంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చత్తీస్గఢ్ వైపు నుంచి తెలంగాణలోని కొమురం భీమ్ అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి వస్తున్న మావోయిస్టుల కదలికలపై సమీక్షా సమావేశంలో లోతుగా చర్చించినట్లుగా సమాచారం.
ఇటీవల తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న క్రమంలో పోలీసు బలగాల నుంచి మావోయిస్టు దళ సభ్యులు తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాశ్, మెడం భాస్కర్ , వర్గీస్ తెలంగాణలో ప్రవేశించినట్లు ఇంటలిజెన్స్ తేల్చిన క్రమంలో నాలుగు రోజులుగా గ్రే హౌండ్స్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి.