
కరోనా మహమ్మారి అయినవారినే కానివారిని చేస్తోంది. ఎంతో దగ్గరగా ఉన్నవారిని దరి చేరనివ్వడంలేదు. 59 ఏళ్లపాటు కలిసి ఉన్న ఓ వృద్ధ జంటను విడదీసింది మాయదారి కరోనా. చివరికి ఆస్పత్రి వారు ఏర్పాటు చేసిన ఫ్లాస్టిక్ తెర వారిని దగ్గర చేసింది.
భార్యాభర్తల మధ్య అంతరాన్ని పెంచింది కరోనా వైరస్. దంపతుల ఎడబాటుకు కారణంగా నిలిచింది. కరోనా వైరస్ భౌతిక దూరంతో బంధాలు, బంధుత్వాలను దూరం చేస్తోంది. కరోనా సోకి భార్య, భర్తలను ఎడబాటుకు గురిచేస్తోంది. అయితే స్పెయిన్ కి చెందిన నర్సింగ్ హోం కరోనా సోకిన దంపతులను దగ్గర చేస్తోంది. అక్కడి ప్లాస్టిక్ తెరలు వైరస్లను అడ్డుకుని, భార్యాభర్తలను కలుపుతున్నాయి.
స్పెయిన్లో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతోంది. అగస్టినా కాసామెరో(81), పాస్కల్ పెరెజ్(83) దంపతులు కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. 83 ఏళ్ల పాస్కల్ కొవిడ్ పాజిటివగా తేలింది. దీంతో అతడు స్థానిక బార్సిలోనాలోని ఒక నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ జంట వారి వైవాహిక జీవితంలో ఒకరినొకరు విడిచి ఎప్పుడూ దూరంగా ఉండలేదు. కాని, లాక్ డౌన్ పుణ్యామాని ఆమె భర్తకు 102 రోజుల పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో నర్సింగ్ హోం సిబ్బంది తమ అత్మీయులను వారు కలుసుకునేందుకు అవకాశం కల్పించారు. అగస్టినా ఈ అవకాశాన్ని వినియోగించుకుంది. ప్లాస్టిక్ షీట్ అడ్డుగా పెట్టి కలుసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఆ భార్యాభర్తలు ప్లాస్టిక్ షీట్ అడ్డుగా పెట్టుకుని కావలించుకున్న క్షణాన వారిలో ప్రేమ ఉప్పొంగింది. కరోనా భయం క్షణాల్లో మటుమాయమైంది. ఇద్దరూ ఒకరినొకరు ఒక నిమిషం పాటు ముద్దు పెట్టుకున్నారు. వారి భావోద్వేగాలకు ప్లాస్టిక్ షీట్ అడ్డుకాలేదు. ఈ విధంగా ఈ నర్సింగ్ హోమ్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు ప్లాస్టిక్ షీట్ల మధ్య తమ ప్రియతములను కలుసుకుని, అంతులేని అప్యాయతను పొందుతున్నారు.